కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 29 : కారులో రెక్కీ నిర్వహించి ఖరీదైన బుల్లెట్ బైక్లను చోరీచేసి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేపీహెచ్బీ కాలనీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నం.1 ఎంఐజీ 556లో నివసిస్తున్న ఇందూరు హర్ష సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ నివసిస్తున్నాడు. ఈనెల 25న కేపీహెచ్బీ కాలనీలో తన ఇంటిముందు పార్కు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్ను మరునాడు (26వ తేదీన) ఉదయం చూసే సరికి కనిపించకుండా పోయింది.
ఈనెల 27న కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లోని అంకుర వైద్యశాలలో నేత శ్యామ్సన్ పార్కు చేసిన యమహా బైక్ మాయమైంది. ఇద్దరు కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. బుల్లెట్, యమహా బైక్లను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. టోలీచౌకి నదీమ్ కాలనీలో నివసించే మహ్మద్ జహీరుద్దీన్ (23) ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ జీవిస్తుండగా అదే ప్రాంతంలోని సెవన్ టూమ్స్ సాబ్రా ఎన్క్లేవ్ కాలనీకి చెందిన మహ్మద్ సర్ఫ్రాజ్ అహ్మద్ (22) లు కలిసి కేపీహెచ్బీ కాలనీలో బుల్లెట్ బండిని దొంగిలించినట్లుగా గుర్తించారు.\
వీరివద్ద బుల్లెట్, యమహా బైక్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. వీరు ఖరీదైన బైక్లను దొంగిలించేందుకు ముందుగా కారులో ఇద్దరు కలిసి రెక్కీ నిర్వహించడం.. బైక్లు కనిపిస్తే ఒకరు కారులో.. మరొకరు బైక్లో పారిపోవడం వీరి ప్రత్యేకత. దొంగిలించిన బైక్లతో సరదాగా తిరుగుతున్న వీరు పోలీసులకు చిక్కడంతో కటకటాల పాలయ్యారు.