మేడ్చల్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మాల్కాజిగిరి జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తి అయ్యింది. పండిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్క్ఫెడ్ శాఖలు ఏప్రిల్ 25న 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 5611 మంది రైతుల నుంచి 28,355 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన అధికారులు రూ.53.15 కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. ఊర్లలోనే కాంటాలు ఏర్పాటు చేసి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత సీజన్లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి అన్నదాతలు ఆర్థికంగా ఎదగాలని కోరుతున్నారు.