కుత్బుల్లాపూర్,ఆగస్టు2: ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అపరిష్కృత డ్రైనేజీ నిర్వహణకు త్వరలో మోక్షం లభించనున్నది. ఇప్పటికే కోట్ల రూపాయలతో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో పనులు పూర్తి చేసుకోగా మిగిలిన ప్రాంతాల్లో నూతనంగా పనులు చేపట్టేందు నిధులు కూడా మంజూరి అయ్యాయి. దీంతో కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని ఎనిమిది డివిజన్ల పరిధిలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కృషితో పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సహకారంతో కొత్తగా జంట సర్కిళ్ల పరిధిల్లోని ఆయా డివిజన్లలో డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ.36.52 కోట్ల నిధులు మంజూరి అయ్యాయి.
కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ప్రధానంగా 187 డ్రైనేజీ లైన్లు సమస్యాత్మకంగా మారినట్లు అధికారులు గుర్తించారు. వీటి పరిధిలో ఉన్న కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం, రంగారెడ్డినగర్, చింతల్, గాజులరామారం, సుభాష్నగర్, జగద్గీరిగుట్ట డివిజన్ పరిధిలో నెలకొని ఉన్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈ నిధులు వెచ్చించనున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో 106 డ్రైనేజీలైన్లు, గాజులరామారం సర్కిల్ పరిధిలో 87 డ్రైనేజీ లైన్లు సమస్యాత్మకంగా ఉన్నాయని, వీటిని ప్రస్తుతం మంజూరైన నిధుల ద్వారా కొత్త లైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంతంగా తీర్చిదిద్దేందుకు ముందుకు సాగుతున్న తరుణంలో పురపాలక శాఖామంత్రి కేటీఆర్ సహకారం మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నది. ఇప్పటికే కోట్ల నిధులను నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించగా కొత్తగా డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులను మంజూరీ చేయడం చాలా సంతోషంగా ఉంది. సకాలంలో పనులు చేపట్టి, ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. – కేపీ వివేకానంద్, ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్
ప్రధానంగా జంట సర్కిళ్ల పరిధిలో పురాతనమైన డ్రైనేజీ లైన్ వలన సమస్య అధికంగా మారుతున్నది. గతంలో అనేక డ్రైనేజీ లైన్ల స్థానంలో కొత్తలైన్లు వేశాం. ఇప్పటి వరకు పూర్తి చేయకుండా ఇంకా మిగిలి ఉన్న మరిన్ని సమస్యాత్మకమైన వాటిని గుర్తించాం. సకాలంలో వాటిని పూర్తి చేస్తే ఇక రాబోయే రోజుల్లో మురుగు పొంగే అవకాశాలు ఉండవు. – కృష్ణచైతన్య, ఈఈ, కుత్బుల్లాపూర్