మేడ్చల్ మల్కాజ్గిరి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం అదేవిధంగా జవహర్ నగర్ కార్పొరేషన్ బాలాజీనగర్ మెయిన్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, జవహర్నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ప్రణీత గౌడ్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, స్థానిక టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కొండల్, తదితరులు పాల్గొన్నారు.
జవహర్నగర్ కార్పొరేషన్ 5వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మూర్గేష్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 200 మంది ఆటో డ్రైవర్లకు మంత్రి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో పేదలను ఆదుకుంటున్న దాతలకు మంత్రి ధన్యవాదములు తెలిపారు.
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇటీవలే మృతి చెందిన నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ శంకర్ కుటుంబ సభ్యులను మంత్రి ఇంటికివెళ్లి పరామర్శించారు. రూ. 4 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.