పెద్దేముల్, ఏప్రిల్ 6 : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అనురాధారమేశ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన శాఖలవారీగా అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పలు సమస్యలను సర్వ సభ్య సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులకు ఇసుక విషయమై తీర్మానం చేసి తనకు అందిస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. తట్టేపల్లిని మండలకేంద్రంగా చేయాలని, కోట్పల్లి రిజర్వాయర్కు నిధులు కేటాయించాలని అసెంబ్లీ సమావేశాల్లో కోరాగా.. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలో మండలంలో డీఎంఎఫ్టీ మైనింగ్ నిధులతో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. విద్యుత్ సమస్యలను సీఎండీ, డైరెక్టర్తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. సీడీఎఫ్ నిధులతో ప్రజాసమస్యలను పరిష్కరిస్తామన్నారు. కరోనా మహమ్మారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకుముందు నూతనంగా ఎన్నికైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్ను, తట్టేపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని అసెంబ్లీలో కోరినందుకు ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని సభ్యులు, తట్టేపల్లివాసులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మధులత, జడ్పీటీసీ ధారాసింగ్, ఎంపీడీవో లక్ష్మప్ప, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్రెడ్డి, జిల్లా, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకటేశ్చారి, ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.