మేడ్చల్, మార్చి15 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువతి యువకులు ఉపాధి బాట పట్టేందుకు మార్గం చూపిస్తున్నది యువజన, క్రీడల శాఖ. ఇందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్ చదివిన వారందరు అర్హులే. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా ప్రభుత్వం వీరికి ఉపాధి కల్పించేందుకు నామమాత్రపు రుసుంతో వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వనున్నది. మూడు నుంచి ఆరు మాసాల శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందజేసి హైదరాబాద్ నగరంలోని వివిధ కంపెనీలు, పరిశ్రమలలో ఉద్యోగం ఇప్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. త్వరలో మేడ్చల్ జిల్లాలోని దేవరాయంజల్ ఎస్సీ వసతి గృహంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు .
శిక్షణా కేంద్రంలో కంప్యూటర్, సీసీ టీవీ కెమెరా, డొమస్టిక్ ఎలక్ట్రీషియన్, సోలార్ టెక్నిషియన్, మొబైల్ సర్వీసింగ్, టైలరింగ్(ఎంబ్రాయిడరి), బ్యూటీషియన్ వృత్తుల్లో శిక్షణ ఇస్తారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్ చదివిన వారు అందరు అర్హులే. వృత్తుల్లో బ్యాచ్లవారీగా శిక్షణ ఇస్తారు. వివిధ వృత్తుల్లో శిక్షణ పొందాల్సిన యువతి, యువకులు నామమాత్రపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వృత్తుల ఆధారంగా మాసానికి 100 నుంచి 500ల రూపాయల వరకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేసి వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
మేడ్చల్ జిల్లాలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏప్రిల్ మొదటివారంలో ప్రారంభం కానున్నది. జిల్లాలోని దేవరాయంజల్లోని ఎస్సీ వసతి గృహంలో ఏర్పాటు చేస్తున్నాం. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 35 ఏండ్ల వయస్సు ఉన్న నిరుద్యోగ యువతి, యువకులకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వనున్నాం. కంప్యూటర్, సీసీ టీవీ కెమెరా, డొమస్టిక్ ఎలక్ట్రీషియన్, సోలార్ టెక్నిషియన్, మొబైల్ సర్వీసింగ్, టైలరింగ్(ఎంబ్రయిడరి) బ్యూటీషియన్లో శిక్షణ ఇస్తాం. శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను అందజేసి వివిధ పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తాం. శిక్షణ తీసుకున్న వారికి సుమారు రూ. 15 వేల నుంచి 20 వేల వరకు వేతనాలు ఉండే అవకాశం ఉంది. వృత్తి నైపుణ్య కేంద్రం ప్రారంభమైన వెంటనే నిరుద్యోగ యువతి, యువకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తాం. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మంత్రులు చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్గౌడ్లు ప్రారంభించనున్నారు. – మేడ్చల్ జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి బలరామారావు