సంగారెడ్డి, జూలై 13 (నమస్తే తెలంగాణ) : వరుసగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో చెరువులు,ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. నల్లవాగు ప్రాజెక్టు అలుగు పారుతున్నది. సింగూరు ప్రాజెక్టులోకి వరద వస్తున్నది. సిం గూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.982 టీఎంసీల నీరుంది. భారీ వర్షాలు కురిస్తే త్వరలోనే సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంటుంది. కొన్ని గ్రామాల్లో చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. జిల్లాలో మోస్తరు నుంచి భారీగా వ ర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 58.93 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. వర్షాలు బాగా కురవడంతో జిల్లాలో 81.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే జిల్లా లో 22.79 సెం.మీటర్ల వర్షం అధికంగా కురిసింది. జిల్లాలోని ఏడు మండలాల్లో 60శాతానికి పైగా అధిక వర్షపాతం నమో దు కాగా, 11 మండలాల్లో 20 నుంచి 59శాతం అధిక వర్ష్షపాతం నమోదైంది. తొమ్మిది మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. మూడు రోజులుగా అలుముకున్న ముసురుతో చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతున్నది. మంజీరా పరీవాహక ప్రాంతాలతో పాటు సింగూరు ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సింగూరు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది.
జలకళను సంతరించుకుంటున్న చెరువులు..
సంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 27 చెరువులు అలుగు పారుతున్నాయి. నారాయణఖేడ్ ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో 20 చెరువులు అలుగులు పారుతుండగా, జహీరాబాద్ సర్కిల్ పరిధిలో ఏడు చెరువులు అలుగు పారుతున్నాయి. వర్షాలతో జిల్లాలో 127 చెరువులు వందశాతం నిండి జలకళను సంతరించుకున్నాయి. సంగారెడ్డి ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో 10 చెరువులు వందశాతం వర్షం నీటితో నిండగా జహీరాబాద్ సర్కిల్ పరిధిలో 93 చెరువులు, నారాయణఖేడ్ సర్కిల్ పరిధిలో 24 చెరువులు పూర్తిగా నిండాయి. జిల్లాలోని 399 చెరువుల్లోకి 75శాతం మేర నీరు చేరాయి. సంగారెడ్డి సర్కిల్ పరిధిలో 196, జహీరాబాద్ పరిధిలో 92, నారాయణఖేడ్ పరిధిలో 111 చెరువుల్లోకి 75 శాతం మేర నీరు చేరాయి. జిల్లాలోని 1328 చెరువుల్లోకి 50 శాతం నీళ్లు వచ్చాయి. సంగారెడ్డి ఇరిగేషన్ సర్కిల్ పరిధిలోని 904 చెరువులు, జహీరాబాద్ పరిధిలో 82, నారాయణఖేడ్లో 179, దౌల్తాబాద్లో 163 చెరువుల్లోకి 50 శాతం మేర నీరు చేరాయి. జిల్లాలోని 1259 చెరువుల్లో 25శాతం నీళ్లు ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురిస్తే అన్ని చెరువులు నిడుతాయని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలు పూర్తిగా నిండాలని రైతులు, మత్స్యకారులు కోరుకుంటున్నారు. చెరువులు నిండితే ఆయకట్టు సాగు విస్తీర్ణం పెరుగుతుంది. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు ఉపాధి లభించనున్నది.
సింగూరులోకి వస్తున్న వరద…
నీటి పారుదలశాఖ అధికారుల సమాచారం మేరకు వారం రోజులుగా సింగూరు ప్రాజెక్టులోకి మూడు టీఎంసీల వరద వచ్చింది. సింగూరు ప్రాజెక్టు పూర్తినీటి సామర్థ్యం 523.600 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 520.934 మీటర్ల నీటిమట్టం ఉంది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 17.982 టీఎంసీల జలాలు ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే తాగు, సాగునీటి కొరత ఉండదు. సింగూరు ప్రాజెక్టు కింద 40,000 ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండితే కుడి, ఎడమకాల్వల ద్వారా పంటపొలాలకు నీరిచ్చే అవకాశం ఉంది.
నల్లవాగు ప్రాజెక్టు..
కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు వర్షాలకు నిండి అలుగు పారుతున్నది. నల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిమట్టం 0.746 టీఎంసీ కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 0.746 నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు నీటిని విడిచి దిగువన ఉన్న చెరువులను నీటితో నింపుతున్నారు. నల్లవాగు ప్రాజెక్టు కింద 6030 ఎకరాల ఆయకట్టు ఉంది. సోమవారం నల్లవాగు ప్రాజెక్టు ద్వారా నీటిని వదిలారు. కుడి కాల్వ కింద ఉన్న పోచాపూర్, బీబీపేట్, మాల్డి, ఖానాపూర్(కె), కృష్ణాపూర్, కల్హేర్ గ్రామాల్లో చెరువులకు నీటిని వదిలారు. ఆయా చెరువుల నిండిన వెంటనే ఆయకట్టుకు సాగునీరు అందజేయనున్నారు. ఎడమ కాల్వ ద్వారా త్వరలోనే నీటిని విడుదల చేయనున్నారు.