పరిగి, మే 20 : కరోనా కట్టడికి ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్డౌన్ గురువారం పరిగిలో పకడ్బందీగా అమలు జరిగింది. ఆంక్షలు సడలింపు సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వివిధ వ్యాపార సంస్థలు తెరవగా, కూరగాయల విక్రయాలు కొనసాగాయి. ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ అమలులోకి రావడంతో పోలీసులు రోడ్డుపై తిరిగే వాహనాలు నిలిపి తనిఖీలు చేశారు. సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్సై పాటిల్ క్రాంతికుమార్ వాహనాలు తనిఖీ నిర్వహించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం జిల్లా అడిషనల్ ఎస్పీ రషీద్ పరిగిని సందర్శించి లాక్డౌన్ అమలును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వయంగా అడిషనల్ ఎస్పీ రషీద్ వాహనాలు తనిఖీ చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు. పరిగిలో గురువారం నిబంధనలు ఉల్లంఘించినందుకు 120 కేసులు నమోదు చేసి 25 వాహనాలు సీజ్ చేశారు.
బయట తిరిగితే చర్యలు
పూడూరు, మే 19 : లాక్డౌన్ సమయంలో బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ హెచ్చరించారు. పూడూరు మండలం అంగడి చిట్టంపల్లి స్టేజీ హైదరాబాద్-బీజాపూర్ హైవే రోడ్డుపై తనిఖీ చేపట్టారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేశామన్నారు. పోలీస్ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ ఇరు జిల్లాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద ప్రతి వాహనాన్ని పరిశీలించి అనుమతి పత్రం ఉంటేనే పంపించాలని సిబ్బందికి సూచించారు.
బయటకు వస్తే వాహనాలు సీజ్ చేస్తాం
పెద్దేముల్, మే 20 : లాక్డౌన్ను మండలంలో కఠినంగా అమలు చేస్తున్నామని ఎస్సై చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితులను పర్యవేక్షించి, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన సుమారు 7 వాహనాలను సీజ్ చేశారు.
యాలాల మండలంలో..
యాలాల, మే 20: మండల పరిధిలో లాక్డౌన్ నిబంధనలు పోలీసులు పకడ్బందీగా చేపడుతున్నారు. మాస్కు ధరించకపోతే రూ.1000 ఫైన్తో పాటు నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేసున్నారు. జన సంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి.