గజ్వేల్, ఆగస్టు 29 : ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు మధిర గ్రామాలను పంచాయతీలుగా మార్చింది. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చాలా గ్రామాల్లో పూర్తికాగా మరిన్ని గ్రామాల్లో కొనసాగుతున్నాయి. పంచాయతీల్లో ఎలాంటి సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేస్తూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని 107 గ్రామ పంచాయతీ భవనాలకు రూ.32.10కోట్ల నిధులు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు కొన్ని పూర్తవగా మరిన్ని కొనసాగుతున్నాయి.
గజ్వేల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడం, ఉన్నవి ఇరుకుగా ఉండడంతో వాటిలోనే పాలకవర్గ సమావేశాల నిర్వహణతోపాటు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ కొత్త భవనాల కోసం నిధులు మంజూరు చేశారు. నియోజకవర్గంలోని పంచాయతీ భవనాల నిర్మాణాలకు రూ.32. 10కోట్లు మంజూరు చేయగా ఈ నిధులతో గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కుక్, కొండపాక, జగదేవ్పూర్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో కొత్త పంచాయతీలతోపాటు శిథిలమైన వాటిని తొలిగించి కొత్త వాటిని నిర్మిస్తున్నారు. ఇందులో గజ్వేల్ మండలానికి 14 మంజూరు కాగా, ఇప్పటివరకు ఏడు భవనాలు పూర్తయ్యాయి. ఇటీవల మండలపరిధిలోని శ్రీగిరిపల్లిలో రూ.63 లక్షలతో నిర్మించుకున్న గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. బయ్యరంలో రెండంతస్తుల భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీటితోపాటు అక్కారం, దాతర్పల్లి, ర్యాగట్లపల్లి, రంగంపేటలో పూర్తయ్యాయి. చిన్నపాటి పనులు చేపడుతున్నారు. కొండపాకలో 11 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు కాగా ఇప్పటివరకు ఐదు పూర్తయ్యాయి. జగదేవ్పూర్ మండలంలో 20 మంజూరు కాగా, 11 పూర్తయ్యాయి. వర్గల్ మండలంలో 23 మంజూరు కాగా 13 గ్రామ పంచాయతీ భవనాలు పూర్తయ్యాయి. ములుగు మండలంలో 12 మంజూరు కాగా ఇప్పటివరకు ఏడు గ్రామ పంచాయతీ భవనాలు పూర్తయ్యాయి. మర్కుక్ మండలంలో 13 మంజూరు కాగా నాలుగు పూర్తయ్యాయి. తూప్రాన్ మండలంలో 9, మనోహరాబాద్ మండలంలో 9 గ్రామ పంచా యతీల్లో రూ.32.10 కోట్ల నిధులతో ఒక్కో పంచాయతీ భవనానికి రూ.30 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్నారు. ఆయా గ్రామాల్లో కొత్తగా నిర్మించే భవనాలకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతో సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మోడల్ పంచాయతీ భవన నిర్మాణాలు
గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించే పంచాయతీ భవనాలు రాష్ట్రంలోనే మోడల్గా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు నిర్మించిన భవనాలతోపాటు కొత్త వాటి నమూనాలను సీఎం కేసీఆర్కు పంపించి ఇక్కడ నిర్మించేందుకు అనుమతి తీసుకున్నారు. ఒక్కో భవనంలో సమావేశాలకు విశాలమైన గది, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి విధులు నిర్వహించేందుకు వేర్వేరుగా గదులు, పంచాయతీకి సంబంధించిన సామగ్రిని భద్రపర్చేందుకు ఒక గది, ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు మరో గదిని నిర్మిస్తారు. ఇక్కడ నిర్మిం చే భవనాల రాష్ట్రంలోనే మోడల్గా ఉండే విధంగా అధికారులు నిర్మాణాలు చేపడుతున్నారు.
గజ్వేల్ మండలానికి మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండలంలో ఇప్పటికే ఏడు పూర్తవగా, మరో ఏడు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే వాటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి గ్రామ సర్పంచ్లకు అప్పగిస్తాం. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
– నాగేందర్, పంచాయతీరాజ్, ఏఈ, గజ్వేల్
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగా గ్రామ పంచాయతీ భవనాన్ని ఆధునిక హంగులతో నిర్మించుకోవడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెద్దపీట వేయడంతో నేడు గ్రామాల్లో అభివృద్ది పనులు పూర్తయ్యాయి. గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణాల కోసం అధిక నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ను సర్పంచ్లు మర్చిపోరు. రాష్ట్రంలో గజ్వేల్ను మోడల్గా తీర్చిదిద్దాలనే కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా సర్పంచులందరూ పని చేస్తున్నారు.
– చెరుకు చంద్రమోహన్రెడ్డి, సర్పంచ్, శ్రీగిరిపల్లి
పంచాయతీ భవన నిర్మాణాలు సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే చేసుకుంటున్నాం. నేడు గ్రామాల్లో అభివృద్ధి జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వ పుణ్యమే. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు సర్పంచ్లందరూ కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకుంటున్నాం. త్వరలో మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభించుకుంటాం.
– మద్దూరి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్, బయ్యారం