చేగుంట, జూలై 29: మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రుణాలు అందజేస్తున్నది. దీంతో మహిళా సంఘాలు స్వయం ఉపాధి పొందుతూ అడ్డ ఆకులతో ఈ ఎకోఫ్రెండ్లీ విస్తరాకులు తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు మేలు చేస్తున్నాయి. డీఆర్డీఏ, డీఆర్డీఓ, ఫారెస్టు అధికారుల సహకారంతో మహిళాసంఘాల సభ్యులు విస్తరాకులు తయారు చేస్తూ ఉపాధి పొందడంతోపాటు మరి కొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్ గ్రామంలోని లావణ్య, రజిత గ్రూపులీడర్లుగా ఏర్పడి మరో 15మంది సభ్యులతో కలిలి దుర్గాభవానీ మహిళాసంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా పొదుపు చెల్లించి, రుణాలు పొందారు. తీసుకున్న రుణంతోపాటు పొదుపు డబ్బులను తీసుకుంటూ సంఘాంలోని సభ్యులు అభివృద్ధి చెందుతున్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో డీఆర్డీఏ, డీఆర్డీవో, కలెక్టర్ సహకారంతో ఫారెస్టు అధికారులు వీరికి రూ. 3లక్షల 50వేల విలువ గల విస్తరాకుల తయారీ మిషన్లు, నాలుగు కుట్టు మిషన్లతోపాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆటవీ ప్రాంతం నుంచి విస్తరాకులకు ఉపయోగించే అడ్డ ఆకులను సేకరించి మహిళాసంఘాలకు అందజేశారు. దుర్గాభవానీ గ్రూప్ 15మంది సభ్యులు విస్తరాకుల ప్లాంట్ను ఏర్పాటు చేసుకొని ఆకులను కుట్టి, బఫెట్ ప్లేట్ల విస్తరాకులను తయారు చేస్తున్నారు. ప్రతిరోజూ గ్రామంలో 15మందికి ఉపాధి అందిస్తున్నారు. ఈ విస్తరాకులో భోజనం చేయడం వల్ల ఆరోగ్యంతోపాటు, పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని మహిళా సంఘాల సభ్యులు, అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆకులతో విస్తరాకులు తయారు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. గ్రూపులోని 15మంది సభ్యులు ఒక్కొక్కరు రోజుకు 150 విస్తరాకులు కుడుతూ రెండువేలకు పైగా విస్తరాకులు తయారు చేస్తున్నారు. మెదక్లోని మంజీరా మార్ట్తోపాటు, పుణ్యక్షేత్రాల్లో జరిగే జాతరతోపాటు, ప్రతి శుభకార్యాలకు విస్తరాకులను అందజేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్, నిజామాబాద్తోపాటు పలు ప్రాంతాలకు ఆకులను సరఫరా చేస్తున్నారు.
మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందాలి
మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రుణాలు అందజేస్తున్నది. గ్రామంలోని దుర్గాభవానీ గ్రూప్ లీడర్లు లావణ్య, రజితలకు అడ్డ విస్తరాకులతో బపెట్ ప్లేట్ల తయారీపై డీఆర్డీఏ ద్వారా శిక్షణ ఇప్పించాం. త్వరలోనే మోదుగ ఆకులతో కూడా ఇలాంటి విస్తరాకులను తయారు చేసే విధంగా సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. అడ్డ విస్తరాకులతో బపెట్ ప్లేట్ల తయారీతో గ్రామంలోని గ్రూప్ సభ్యులు ఉపాధి పొందుతున్నారు.
– సుల్తానా, ఐకేపీ సీసీ, నార్సింగి మండలం
మహిళా సంఘాలతో కల్తీలేని ఉత్పత్తులు తయారీ
గ్రామీణ నిరుపేద నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు రుణాలు అందజేస్తున్నాం. వాటితో మారుమూల గ్రామాల్లో మహిళలకు వారి నైపుణ్యం ఆధారంగా డీఆర్డీఏ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన రుణాలతో సంఘాలు తయారు చేసిన కల్తీలేని ఉత్పత్తులను మెదక్లోని మంజీరా మార్ట్ ద్వారా విక్రయిస్తున్నాం.
– మంత్రి శంకర్, ఐకేపీ సీసీ, నార్సింగి మండలం
గ్రూప్ సభ్యులకు గ్రామంలోనే ఉపాధి
అడ్డాకులతో విస్తరాకులు, బపెట్ ప్లేట్ల తయారు చేస్తున్నాం. గ్రూపులోని సభ్యులందరికీ ఉపాధి దొరుకుతున్నది. విస్తరాకుల తయారీ కోసం రూ.మూడున్నర లక్షల విలువగల మిషన్లు, ఆకులను ఫ్రీగా ఫారెస్టు అధికారులు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి మా మహిళా గ్రూప్ సరఫరా చేస్తాం.
– లావణ్య, దుర్గాభవానీ గ్రూప్ లీడర్, జప్తిశివునూర్