జిన్నారం, జనవరి 4: ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ సాగుపై నోవార్టీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో వారం రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సుకు సోలక్పల్లి గ్రామానికి చెందిన యాభై మంది మహిళా రైతులు బుధవారం బయలుదేరి వెళ్లారు. చెన్నై వెళ్తున్న మహిళా రైతుల బృందం బస్సును ఎంపీపీ రవీందర్గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ జిన్నారం మండలంలోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకున్న నోవార్టీస్ సంస్థ గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, నీటి వనరుల పునరుద్ధరణతో పాటు విద్యార్థులకు చేయూతనిస్తున్నదన్నారు.
ఇక్కడ రైతులు సాగు చేస్తున్న పంటలు, పద్ధతులను పరిశీలించిన సంస్థ ప్రతినిధులు చెన్నైలో ఉచితంగా అవగాహన కల్పిం చేందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. గతంలో వావిలాల, లక్ష్మీపతి గూడెం గ్రామాలకు చెందిన వంద మంది రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ వ్యవసాయంపై వారం రోజుల పాటు అవగాహన కల్పించి, ఫీల్డ్ విజిట్ చేయించి ఇక్కడ సాగు చేసేలా ప్రోత్సహించారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయ సాగుకు రైతులు మక్కువ చూపిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సోలక్పల్లి సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, అండూరు సర్పంచ్ ఖదీర్, రాళ్లకత్వ సర్పంచ్ రమామల్లేశ్, ఎంపీటీసీ స్వాతిప్రభాకర్రెడ్డి, నోవార్టీస్ సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.