హుస్నాబాద్ టౌన్, మే 28: ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సిద్దిపేజట జిల్లా మహిళలు సద్వి నియోగపరుచుకుంటున్నారు. అధిక వడ్డీ బెడద లేకుండా, రుణం భారం కాకుండా మహిళలకు సహాయాన్ని అందిస్తున్న స్త్రీనిధి పథకం వారిని వ్యాపార రంగంలో రాణింపజేస్తున్నది. ఈ పథకంలో హుస్నాబాద్ పట్టణానికి చెందిన 352 మంది మహిళలకు 2022-23 సంవత్సరానికి 2.43 కోట్ల రుణాన్ని అందించింది ప్రభుత్వం. దీంతో జిల్లాలోనే హుస్నాబాద్ స్త్రీనిధి లావాదేవీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. రుణం పొందడమే కాదు తీసుకున్న రుణాన్ని సైతం తిరిగి చెల్లించడంలో సైతం హుస్నాబాద్ పట్టణ మహిళలు ముందు వరుసలో నిలుస్తున్నారు.
అవసరం ఏదైనా స్త్రీనిధి రుణం…
కుటుంబాల వ్యక్తిగత అవసరాలు, వ్యాపారాల నిర్వహణతో ఆర్థికంగా ఎదిగేందుకు స్త్రీనిధి రుణాలు మహిళలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. సువిధ, ప్రగతి, అక్షయ, సౌభాగ్య అనే నాలుగు రకాల రుణాలను స్త్రీనిధి ద్వారా అందిస్తున్నారు. స్వశక్తి సంఘాలకు చెందిన వాటాధనం, బ్యాంకులు, ప్రభుత్వం ద్వారా అందిస్తున్న నిధులను స్త్రీనిధి ద్వారా మహిళలకు రుణాలను అందిస్తున్నారు. పైగా రుణ సహాయం కోసం ధ్రువపత్రాల ఖర్చును సైతం భారీగానే తగ్గించి రుణాన్ని మంజూరు చేయడంతో రుణం పొందేందుకు ఎక్కువ సంఖ్యలో మహిళలు ఆసక్తి
చూపుతున్నారు.
92 శాతం రుణాలు పంపిణీ…
హుస్నాబాద్ పట్టణానికి చెందిన స్వశక్తి సంఘాలకు చెందిన మహిళలకు 92శాతం రుణ సహాయాన్ని అందించి జిల్లాలోని మున్సిపాలిటీల్లో హుస్నాబాద్ ముందంజలో నిలిచింది. 2021-22 సంవత్సరానికి రూ. 2.58 కోట్ల రుణ పంపిణీ టార్గెట్ ఉండగా, రూ.4.22 కోట్ల రుణాన్ని అందించారు. 2022-23 సంవత్సరానికి రూ.2.64 కోట్ల రుణ పంపిణీ టార్గెట్ నిర్ణయించారు. పైగా తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించడంలో ఈ ప్రాంత మహిళలు ముందు వరుసలో ఉన్నారు.
ప్రథమ స్థానం అవార్డు అందుకున్న హుస్నాబాద్ పట్టణ సమాఖ్య…
స్త్రీనిధిలో రూ.2.56 కోట్ల రుణాలు అందించి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో హుస్నాబాద్ పట్టణ సమాఖ్య ప్రథమ స్థానంలో నిలిచింది. సిద్దిపేట మున్సిపాలిటీలో రుణ పంపిణీ 77 శాతం ఉండగా, దుబ్బాక 64.98 శాతం, గజ్వేల్ మున్సిపాలిటీలో 48.52 శాతం రుణ పంపిణీ జరిగింది. మహిళలకు స్త్రీనిధిలో రుణాలను భారీగా అందించి హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచి జిల్లాస్థాయిలో ఉత్తమ పట్టణ సమాఖ్య అవార్డును సాధించింది.
గత మార్చి నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చేతుల మీదుగా ఉత్తమ పట్టణ సమాఖ్య అవార్డును మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, మెప్మా కో-ఆర్డినేటర్ రాజు అందుకున్నారు.
రెండు రోజుల్లోనే రుణాలు…
రూ.25 వేల వరకు రుణం తీసుకునే మహిళలకు ఎలాంటి పత్రాలు లేకుండానే రెండు రోజుల్లోనే రుణాలను స్త్రీనిధి ద్వారా అందజేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద ఎత్తున నిర్వహించే వ్యాపారాలకు రుణాలను వారం రోజుల నుంచి 15 రోజుల్లోనే మంజూరు చేస్తున్నారు. దీంతో మహిళల నిర్వహించే వ్యాపారానికి స్త్రీనిధి రుణాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు దోహద పడుతున్నదని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టెంట్హౌజ్ కోసం రుణం తీసుకున్నా…
ఆరు నెలల కిందట స్త్రీనిధి ద్వారా లక్ష రూపాయల అప్పు తీసుకొని టెంట్హౌజ్ పెట్టుకున్నా. వ్యాపారం బాగానే సాగుతున్నది. ఈ వ్యాపారంతోపాటు ఇంట్లో కుట్టు పనిని చేస్తున్నా. తీసుకున్న అప్పు నెలకోమారు చెల్లిస్తున్నా. స్త్రీనిధి ద్వారా మా కుటుంబానికి మేలు జరిగింది.
-అర్చన, హుస్నాబాద్
కిరాణ దుకాణం కోసం రుణం తీసుకున్నా..
లక్ష రూపాయలు కిరాణా కోసం తీసుకొని నడిపిస్తున్నా. రోజుకు వెయ్యి పదిహేను వందల రూపాయల గిరాకీ అవుతుంది. ఈ దుకాణంతోపాటు బడిలో ఆయాగా కూడా పనిచేస్తున్నా. నెలనెలకు తీసుకున్న రుణం కడుతున్న. మాలాంటి పేద మహిళలకు స్త్రీనిధి రుణం ఎంతగానో ఉపయోగపడింది.
-మొగిలిపాక అనిత, హుస్నాబాద్
బ్యూటీషియన్ కోసం రుణం తీసుకున్న..
స్త్రీనిధి ద్వారా రూ.25 వేల రుణం తీసుకున్న బ్యూటీపార్లర్ పెట్టుకున్నాను. తీసుకున్న అప్పు కూడా చెల్లించాను. మళ్లీ స్త్రీనిధి ద్వారా రెండు లక్షల రూపాయల రుణం తీసుకోవాలని అనుకుంటున్నాను. రుణం తీసుకొని పెద్దగా వ్యాపారం చేయాలని భావిస్తున్నాను.
– అనురాధ, బ్యూటీషియన్, హుస్నాబాద్
అప్పులు తీసుకొని తిరిగి చెల్లించడం ఇక్కడి మహిళల ప్రత్యేకత…
బతుకుదెరువు కోసం వ్యాపారం నిర్వహించే మహిళలకు స్త్రీనిధి రుణం తోడుగా నిలుస్తున్నది. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇక్కడి మహిళలకు పెద్ద సంఖ్యలో రుణం ఇచ్చాం. టైలరింగ్, డెయిరీ, వీధి వ్యాపారం, హోటల్స్, బ్యూటీపార్లర్లు తదితర వ్యాపారాల కోసం మహిళలకు రుణాలు ఇచ్చాం. ఈ ప్రాంత మహిళల తోడ్పాటుతో జిల్లాలోనే హుస్నాబాద్ ముందు వరుసలో నిలిచింది.
-వి.సునీత, అసిస్టెంట్ మేనేజర్, స్త్రీనిధి, హుస్నాబాద్