హుస్నాబాద్, అక్టోబర్ 12 : దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన మహాసముద్రం చెరువు గండి పనులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మోక్షం లభించింది. చిన్ననీటి వనరు అయినా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించిన సీఎం కేసీఆర్ ముందుచూపుతో రూ.6.55 కోట్లను కేటాయించి గండి పనులు పూర్తి చేయించారు. మరో 2.26కోట్ల నిధులను భూనిర్వాసితులకు పరిహారంగా ఇచ్చారు. మొత్తం రూ.8.81కోట్లతో గండి నిర్మాణం పూర్తి చేయించారు. ఏండ్ల నాటి కల నెరవేరడంతో హుస్నాబాద్, సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లోని పలు గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గండి నిర్మాణానికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, పనులు పూర్తి చేయించిన మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్కు ఈ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ శివారులో చుట్టూ గుట్టలు…గుట్టల మధ్య విశాలమైన లోయలో సహజ సిద్ధంగా ఏర్పడింది మహా సముద్రం చెరువు. చుట్టూ ఉన్న గ్రామాలకు సాగు, తాగునీరందించిన ఈ జల వనరును అప్పటి ప్రజలు ‘మహా సముద్రం’గా పిలుచుకున్నారు. వర్షాకాలంలో నిండుకుండలా ఉండి చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచి రైతులకు సిరులు కురిపించిన మహాసముద్రం చెరువుకు ఆరు దశాబ్దాల క్రితం గండి పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుంది. ఇందులోకి వచ్చే వరద వృథాగా దిగువకు వెళ్లిపోయేది. నీళ్లు నిల్వ ఉండక పోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో నీళ్లు అడుగంటడం మొదలైంది. మహాసముద్రం గండిని పూడ్చాలని దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు పాలకులను వేడుకుంటూ వచ్చారు.
మహాసముద్రం గండి ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గండిని స్వయంగా సందర్శించి నిధులు మంజూరు చేశారు. ఆగస్టు 8, 2015న గండిని సందర్శించిన సీఎం అక్కడే జరిగిన బహిరంగ సభలో గండి నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక మరమ్మత్తులు కాకుండా శాశ్వతంగా ఉండేలా నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణంలో సీఎం సుమారు రెండు గంటల పాటు గడిపారు. అంతకు ముందు అప్పటి రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు గండిని సందర్శించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు. స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో పాటు తెలంగాణ వికాస సమితి నాయకులు గండి ప్రత్యేకత, ప్రాధాన్యతను గురించి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు వివరించడంతో పనులకు మోక్షం కలిగింది. నవంబర్ 8, 2016లో మంత్రి హరీశ్రావు గండి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పనులు పూర్తయి ఈ ప్రాంతంలో చిన్ననీటి వనరుగా గుర్తించబడింది.
మహాసముద్రం గండిలో 0.5 టీఎంసీ(అర టీఎంసీ)ల నీళ్లు నిల్వ ఉంటాయి. ఒకసారి ఇది నిండితే రెండేండ్ల పాటు వర్షాలు లేకున్నా చుట్టుపక్కల గ్రామాల్లో నీటికి కరువు ఉండదు. సుమారు 65ఎకరాల శిఖం భూములు కలిగిన గండికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన మత్తడితో పాటు 17మీటర్ల ఎత్తుతో కట్ట నిర్మాణం చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించి కేవలం మూడేండ్లలోనే నిర్మాణ పనులు పూర్తి చేయించారు. ఒకసారి నిండితే సుమారు వెయ్యి ఎకరాలకు పరోక్షంగా సాగునీరందిస్తుంది.
మహాసముద్రం గండి ప్రాంతం ప్రకృతి అందాలకు నిలయంగా చెప్పవచ్చు. చుట్టూ పచ్చని గుట్టలు ఉండి పెద్ద పెద్ద వృక్షాలతో అలరారుతున్నది. గండి ప్రదేశంలోకి వెళ్లిన వారికి ఊటీ, కొడైకెనాల్ వెళ్లిన అనుభూతి కలుగుతుంది. వందలాది ఎకరాల్లో ఆవరించి ఉన్న గుట్టలు, అటవీ ప్రాంతం, వివిధ రకాల జంతువులు, పక్షులకు నిలయంగా ఉంటుంది. పక్షుల కిలకిల రావాలు శ్రవణానందాన్నిస్తాయి. బయ్యన్న గుట్టలో ఆదిమానవులు జీవించిన ఆనవాళ్లు అడుగడుగునా కనబడుతాయి. గుట్టపై ఉన్న బయ్యన్న విగ్రహాన్ని దర్శించుకునేందుకు ఇప్పటికీ భక్తులు ప్రతి శ్రావణ మాసంలో వెళ్తుంటారు. బయ్యన్న విగ్రహం చెక్కిన ప్రాంతంలో ఆదిమానవులు వాడిన వస్తువులు, చేదబావులు దర్శనమిస్తుంటాయి. ఇదే గుట్టలపై అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించేందుకు హుస్నాబాద్కు చెందిన అయ్యప్ప భక్తులు పనులు మొదలు పెట్టారు.
మహాసముద్రం గండి నిర్మాణంతో హుస్నాబాద్ పట్టణంతో పాటు మండలంలోని కొన్ని గ్రామాలు, సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లోని పలు గ్రామాల రైతులకు మేలు జరుగుతున్నది. గండి ప్రాధాన్యతను వివరించగానే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు స్పందించి వెంటనే నిధులు కేటాయించారు. వారికి ధన్యవాదాలు. ఉమ్మాపూర్ బయ్యన్న గుట్టలో ఆదిమానవులు జీవించిన ఆధారాలు కనిపిస్తాయి. గండితో హుస్నాబాద్, సైదాపూర్ మండలాల రైతుల కల నెరవేరింది. ఇది నిండితే సుమారు 20 గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. ప్రభుత్వం ఇచ్చే 24గంటల కరెంటుతో పాటు పెరిగిన భూగర్భ జలాలతో ఈ ప్రాంత రైతులు విరివిగా పంటలు పండించుకునే అవకాశం ఉంది. సొంత ప్రభుత్వం వస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మహాసముద్రం గండి పనులను చూసి అర్థం చేసుకోవచ్చు.