ఉమ్మడి మెదక్ జిల్లాలో పాత సొసైటీలకు ఇబ్బంది లేకుండా కొత్తవి ఏర్పాటు
జిల్లాలో నీటి వనరులు పెరగడంతో కొత్తగా సభ్యత్వాలు కల్పించాలి
ఎకరానికి ఒక సభ్యుడిని ఎంపిక చేయాలి
మండలాల వారీగా లెక్కలు తీయండి
మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
హైదరాబాద్లో సమీక్షా సమావేశంలో ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇవ్వాలని ఎన్నో ఏండ్ల నుంచి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారని, గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే మత్స్యకారుల సమస్యలు, డిమాండ్లపై స్పందించారని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మత్స్యశాఖ ప్రగతిపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మత్స్యశాఖ అధికారులతో గురువారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారు మాత్ర మే అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు రిజర్వాయర్లు నిర్మించామన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు పునరుద్ధరించినట్లు తెలిపారు.
దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో నీటి వనరులు గణనీయంగా పెరిగాయన్నారు. ఎండకాలంలోనూ చెరువుల్లో నీరు ఉందన్నారు. గోదావరి జలాల రాకతో మండుటెండల్లో సైతం చెరువులు అలుగు పారుతున్నాయని మంత్రి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ సహకారంతో పెద్ద ఎత్తున చెక్డ్యామ్లు నిర్మించడంతో భూగర్భ జలాలు వృద్ధి చెందినట్లు తెలిపారు. చేప పిల్లల పెంపకంతో మత్స్యకార కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తున్నదన్నారు. నీటి వనరులు పెరిగిన చోట కొత్తగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు. నీటి వనరులు లేనప్పుడు రెండున్నర ఎకరాలకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేశామన్నారు. ఇప్పడు నీటి వనరులు పెరగడంతో ఎకరం నీటి వనరుకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ లెక్కన కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడంతో పాటు పాత సొసైటీల్లోనూ ఎకరాకు ఒకరిని సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. దీంతో పాత సొసైటీల్లోనూ కొత్తగా సభ్యులను ఎంపిక చేయవచ్చని మంత్రి సూచించారు. సిద్దిపేట జిల్లాలో 281సొసైటీలు ఉండగా, అందులో 20,731మందికి సభ్యత్వం ఉందన్నారు. ప్రస్తుతం ఈ సొసైటీలు జిల్లాలోని 1255 నీటి వనరులను వినియోగించుకుంటున్నాయని, మరో 381నీటి వనరులకు సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నా రు. మెదక్ జిల్లాలో 263సొసైటీల్లో 15,724మంది సభ్యులు ఉన్నారని, ఈ సొసైటీలు జిల్లాలోని 1379నీటి వనరులను వినియోగించుకుంటున్నాయని తెలిపారు. ఇంకా 235 నీటి వనరులకు కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 193 సొసైటీల్లో 10,434మంది సభ్యులు ఉన్నారని, ఈ సంఘాలు 875నీటి వనరులు వినియోగించుకుంటున్నాయని తెలిపారు. కొత్తగా 196 నీటి వనరులకు సొసైటీలను ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
మండల, నియోజకవర్గాల వారీగా లెక్క తేల్చండి..
మండలాలు, నియోజకవర్గాల వారీగా నీటి వనరులు ఎలా ఉన్నాయో లెక్క తేల్చాలని మత్స్యశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఏ చెరువు వర్షం మీద ఆధారపడి ఉంది. ఏ చెరు వు కాలువ నీరు చేరుతుంది అనే పూర్తి సమాచారాన్ని సేకరించాలన్నారు. ఏ సొసైటీలో ఎందరు సభ్యు లు ఉన్నారు. కొత్తగా ఎంతమందిని చేర్చుకోవచ్చు, అనే లెక్కలు తీయాలన్నారు. కొత్తగా సభ్యత్వం ఇవ్వడం, కొత్త సొసైటీల ఏర్పాటుతో మత్స్య కారులకు మేలు జరుగుతుందని మంత్రి అన్నారు. సొసైటీలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే బీమా సౌకర్యం కలుగుతుందని, రుణం సులువుగా లభిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, పథకాలు అందరికీ వర్తిస్తాయన్నారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ బండాప్రకాశ్, ఎమ్మెల్యే లు పద్మాదేవేందర్రెడ్డి, క్రాంతికిరణ్, మదన్రెడ్డి, మాణిక్రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఫిషరీష్ శాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.