– కాంట్రాక్ట్ టెండర్ల పేరిట నష్టాల్లోకి విభాగాలు
– సామాన్యుడిపై మోయలేని చార్జీల భారం
– కనుమరుగు కానున్న కొత్త ఉద్యోగాలు
– 47 రోజులుగా ఉద్యోగుల నిరసన
– బుధవారం విద్యుత్ సౌధ ముట్టడి
భద్రాచలం, ఆగస్టు 18 : విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే దిశగా జరుగుతున్న పరిణామాలు భవిష్యత్లో తీవ్ర ప్రతికూల ఫలితాలకు దారితీసేలా ఉన్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు, కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పగించడం వల్ల ప్రజలతో పాటు నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం జిల్లాలోని పాల్వంచ, భద్రాచలం, మణుగూరు మూడు డివిజన్ల పరిధిలో విద్యుత్ ఉద్యోగులు గత 47 రోజులుగా ఆందోళన బాట పట్టినప్పటికీ ప్రజా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్లోని ‘విద్యుత్ సౌధ’ ముట్టడికి ఉద్యోగులు రణభేరి మోగించారు.
ప్రస్తుతం విద్యుత్ శాఖలోని సొంత సిబ్బందితో చేస్తున్న పనులను కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు అధిక విలువతో టెండర్లు కేటాయిస్తున్నారు. శాఖ ద్వారా అయ్యే వ్యయం కంటే ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్న టెండర్ల విలువ చాలా ఎక్కువగా ఉండటంతో డిపార్ట్మెంట్ కు తీవ్రమైన ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఉద్యోగ అవకాశాలకు భారీ గండి ప్రైవేటీకరణ వల్ల అత్యంత తీవ్రంగా దెబ్బతినేది తెలంగాణ నిరుద్యోగ యువతే. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత, ఆ ఖాళీలలో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేకుండా పోతుంది. ఒకవేళ సంస్థలు ప్రైవేట్ పరమైతే తెలంగాణ యువత తమ ఉద్యోగావకాశాలను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
విద్యుత్ అనేది సామాన్య మానవుడి రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన అత్యవసర సేవ. కాంట్రాక్ట్ సంస్థలు తమ వ్యయాన్ని, లాభాలను రాబట్టుకోవడానికి నిరంతరం కరెంట్ చార్జీలను పెంచే అవకాశం ఉంది. విద్యుత్ చార్జీల రూపంలో సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుంది. అంతేకాకుండా, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు, వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు కూడా ప్రైవేటీకరణ వల్ల భవిష్యత్లో ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం హైదరాబాద్ లో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్, డీఈ కె.జీవన్ కుమార్ పిలుపునిచ్చారు. మహాధర్నాకు సంబంధించిన పోస్టర్ ను మంగళవారం భద్రాచలం డివిజన్ విద్యుత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ విద్యుత్ ఉద్యోగుల ప్రాథమిక హక్కు అన్నారు. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణతో పాటు ఈపీఎఫ్ ను జీపీఎఫ్ గా మార్చాలని, సాధారణ బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ ఈబీ నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ ప్రైవేటీకరణతో ముప్పు.. ప్రజలు, నిరుద్యోగులపై తీవ్ర భారం!
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వల్ల భవిష్యత్లో వినియోగదారులపై ఆర్ధికభారం తీవ్రంగా పడనుంది. అలాగే ఇప్పుడు విద్యుత్ సంస్థలో ఇచ్చే కాంట్రాక్టులను అధిక రేట్లకు ఇవ్వడం వల్ల వినియోగదారులపై ఆర్ధికభారం పడుతుంది. దీంతో విద్యుత్ చార్జీలను పెంచడంతో పాటు విద్యుత్ సంస్థలు మరింత నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
ప్రైవేటీకరణ చేస్తే విద్యుత్ సంస్థల మనుడగ కోల్పోనున్నాయి. కాంట్రాక్టర్ల గుత్తాధిపత్యం వల్ల చార్జీల మోత, ప్రజలకు నష్టం కలిగించే సంస్కరణలు తెస్తే ఆ భారం ప్రజలతో పాటు విద్యుత్ సంస్థల మనుగడపై సైతం పడుతుంది. దీంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఏర్పడుతుంది. ప్రభుత్వమే నడిపితే విద్యుత్ సంస్థల మనుగడ బాగుటుంది. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.