సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దేశ ప్రజలు ఫిదా అయ్యారని, బీఆర్ఎస్ సర్కారుతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం సిర్గాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో గిరిజన తండాలు, మారుమూల పల్లెల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు స్వార్థ రాజకీయం కోసం అధికార పార్టీపై బురదజల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగూరు నుంచి నల్లవాగు ప్రాజెక్టుకు సాగు నీళ్లు తీసుకొచ్చి రెండు పంటల పండించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
సిర్గాపూర్, ఏప్రిల్ 8: తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలకు దేశంలో పలు రాష్ర్టాల ప్రజలు ఫిదా అయ్యారని, బీఆర్ఎస్తోనే సంక్షేమం సాధ్యమవుతుందని వారు నమ్ముతుండడంతో దేశ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన సిర్గాపూర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
కార్యక్రమానికి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమ ఫలాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీలు కుళ్లుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
నారాయణఖేడ్ నియోజవర్గంలో కాంగ్రెస్ నాయకులు మానవత్వంతో ఆలోచించే పనులు ఒక్కటి కూడా చేయడంలేదని ఆరోపించారు. రాజకీయంగా ఆలోచించి స్వార్థంతో అధికార పార్టీపై బురుద జల్లుతున్నారన్నారు. గతంలో అభివృద్ధికి నోచుకోని కుగ్రామాలు, గిరిజన తండాలు ఇప్పుడు ప్రత్యేక పంచాయతీలుగా మారి, అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. 80శాతం పైగా తండాల్లో, గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి నిర్మించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్లవాగు ప్రాజెక్టు అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరు చేస్తే ఆ పార్టీ బడా నాయకులు ఒక్క పని చేయకుండా నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.24 కోట్లు నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. సింగూర్ నుంచి నల్లవాగు వరకు సాగు నీళ్లు తెచ్చి రెండు పంటల పండించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏదీ లేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే, తాను ఎమ్మెల్యేగా వచ్చాకే సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చినట్లు వివరించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలే కీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు కృష్ణమూర్తి, తెలంగాణ జాగృతి జిల్లా నాయకుడు అరుణ్రాజ్, నాయకులు యాదవరావు, శ్రీనివాస్రావు పాటిల్, మాధవరావు, అరుణ్రాజ్, దివ్యభారతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన ధూంధాం..
ఆత్మీయ సమ్మేళనంలో ముందుగా గాయకుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో కళాకారులు నిర్వహించిన ధూంధాం ఆట, పాటలు అందరినీ అలరిచించాయి. అనంతరం సీఎం సందేశాన్ని యువ నాయకుడు అరుణ్రాజ్ చదివి వినిపించారు. దీంట్లోని అంశాలపై సభికులు కరతాళ ధ్వనులు వినిపించారు. అనంతరం నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వగా, వారు మాట్లాడుతూ అన్నం తిన్న ఇంటిని ఎప్పుడూ మరిచిపోమన్నారు. కడుపులో బిడ్డ నుంచి చచ్చే వరకు సర్కారు సంక్షేమ ఫలాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వెంట సైనికుల్లా పని చేస్తామని అన్నారు.
వాడవాడల్లో అభివృద్ధి జరిగింది..
– రాఘవరెడ్డి, జడ్పీటీసీ సిర్గాపూర్ మండలం
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గ్రామాభివృద్ధి జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కృషి వల్లనే వాడవాడలో అభివృద్ధి అయ్యింది. గ్రామాల్లో జరిగిన సంక్షేమాభివృద్ధి చూసి ఓర్వలేకనే కాంగ్రెసోళ్లు రెచ్చ గొట్టే పనులు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్కు దక్కింది. కులాల వారీగా కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేయించి, వాటి నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మూడో మారు గెలిపించుకుంటాం.
కాంగ్రెస్, బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి..
– జార మహిపాల్రెడ్డి, ఎంపీపీ సిర్గాపూర్ మండలం
60 ఏండ్ల పాలనలో కాంగ్రెసోళ్లు చేసింది ఏమీలేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారు రకరకాల వేషాలు వేస్తున్నారు. సిర్గాపూర్ ప్రత్యేక మండలం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. ఆత్మీయ సమ్మేళనం ద్వారా పార్టీలో కార్యకర్తల్లో చైతన్య వంతం అవుతారు. స్థానికంగా బలోపేతమవుతున్నది.
బీజేపీ దుర్మార్గాన్ని ఎదురిద్దాం..
– సంజీవరావు, బీఆర్ఎస్ సిర్గాపూర్ మండలాధ్యక్షుడు
రోజురోజుకీ బీజేపీ అరాచకాలు శృతిమించుతున్నాయి. ఆ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే. 60 ఏండ్లలో కాంగ్రెస్, బీజేపీ వారు చేసిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం జరిగిన అభివృద్ధితో పోల్చితే అర్థమవుతుంది. రాజకీయ స్వార్థంతో ప్రజలకు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదు.
ఎడ్లబండిపై సమ్మేళనానికి..
సిర్గాపూర్ చౌరస్తా నుంచి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆత్మీయ సమ్మేళనం ప్రాంగణం వరకు ఎడ్ల బండపై ఊరేగింపుగా వచ్చారు. పార్టీ మండలాధ్యక్షుడు సంజీవరావు, పట్టణ అధ్యక్షుడు యాదవరావు, జడ్పీటీసీ రాఘవరెడ్డి, ఎంపీపీ మహిపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రయాగ మాధవరావు తదితరులు ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. బ్యాండ్ మేళాలతో నిర్వహించిన ఊరేగింపులో కార్యకర్తలు ఉత్సహంతో డ్యాన్స్లు చేశారు.