మెదక్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగని అభివృద్ధి ఈ తొమ్మిదేండ్లలో జరిగింది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి పథకాలు అమలు చేస్తూ ప్రజల మనస్సును గెలుసుకున్నారు. సబ్బండవర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నారు. మెతుకుసీమగా ఉన్న మెదక్ జిల్లా ఇటు సంక్షేమంలోనూ అటు అభివృద్ధిలోనూ పరుగులు పెడుతోంది.
ఆసరా పెన్షన్ సీమ్…
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం సాయంగా నిలించేందుకే తెలంగాణ ప్రభుత్వం ‘ఆసరా పెన్షన్ సీమ్’ను ప్రారంభించింది. చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ ఎయిడ్స్ ఉన్న వారు కూడా ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత నవంబర్ 8, 2014లో తొలుత రూ.500 కోట్ల బడ్జెట్తో అమల్లోకి తెచ్చింది. గత ప్రభుత్వాలు కంటితుడుపుగా రూ.200 పింఛన్ ఇచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆసరా పింఛన్ కింద ఇచ్చే మొత్తాన్ని రూ.2,016కు పెంచింది. దివ్యాంగులకు రూ.3,016కు పెంచింది. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, పైలేరియా బాధితులకు, డయాలసిస్ పేషంట్లకు సైతం రూ.2,016 పింఛన్ ఇస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,16,882 మందికి గానూ ప్రతినెలా రూ.26.07 కోట్లు ఇస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు రూ.1555 కోట్ల 90 లక్షల పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు.
రైతు బంధు…
తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైతుబంధు పథకం తీసుకొచ్చింది. తొలుత ఎకరా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో, ఆ తర్వాత 2 ఎకరాలు.. ఆ తర్వాత 2 నుంచి 3 ఎకరాలు ఇలా విస్తీర్ణం చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాల్లో ఒకటిగా రోమ్లో 2018 నవంబర్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్ఏఓ గుర్తించింది. అలాగే రైతుబీమా పథకం తెలంగాణ ప్రభుత్వం రైతులకు అడగకుండానే అందించిన మరోవరం. మెదక్ జిల్లాలో ఈ యాసంగిలో 2 లక్షల 39వేల 579 మంది రైతులకు రూ.189 కోట్ల 57 లక్షలు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ రూ.5 లక్షల బీమా కల్పించింది.
కల్యాణ లక్ష్మి…
పేదింటి ఆడబిడ్డల పెండ్లి చేసేందుకు తల్లిదండ్రులు అప్పు చేయకూడదని, వారి ఇండ్లల్లో సంతోషం నింపేందుకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చారు. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతుల వివాహానికి రూ.51,000 వేల ఆర్థికసాయాన్ని అందించేవారు. తర్వాత ఈ పథకాన్ని బీసీలకు సైతం వర్తింపజేశారు. 2017లో ఈ మొత్తాన్ని 75,116కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం.. మార్చి 19, 2018 నుంచి కల్యాణలక్ష్మి ఆర్థికసాయాన్ని రూ.1,00116 లకు పెంచడం తెలిసిందే. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంలా మారింది. ఇప్పటివరకు మెదక్ జిల్లాలో కల్యాణలక్ష్మీ పథకం కింద 26,150 మందికి రూ.242కోట్ల 10 లక్షలు, షాదీముబారక్ కింద 2,169 మంది లబ్ధిదారులకు రూ.19 కోట్ల 21 లక్షలు అందించారు. 18 ఏండ్లు నిండిన ఆడపిల్లలకే కల్యాణ లక్ష్మీ సాయం వర్తిస్తోంది. జిల్లాలోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం కల్యాణలక్ష్మి పథకం కింద రూ.1,00,116 చొప్పున ఆర్థికసాయం అందించే లక్ష్యంతో 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టింది.
దళితబంధు పథకం
తెలంగాణ దళితబంధు పథకం అనేది దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకం. అర్హులైన దళితులకు ఈ పథకంలో భాగంగా కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు. చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. 2021, ఆగస్టు 5న యాదాద్రి భువనగిరి జిల్లా, తురపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. దళితుల కోసం గతేడాది బడ్జెట్లో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ సీం పేరుతో వెయ్యి కోట్లు కేటాయించారు. మెదక్ జిల్లాలో ఈ పథకం కింద 256 మంది లబ్ధిదారులకు రూ.24కోట్ల 34లక్షలు అందించారు.