బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ అన్నారు. అక్కన్నపేట మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 60 ఏండ్లలో చేయని అభివృద్ధిని కేవలం సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసి చూపించారన్నారు. ప్రతిపక్షాలు అడ్డగోలు హామీలు ఇస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఓటువేసి బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ఒక్క చాన్స్ అంటూ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్ని కోట్లు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
అక్కన్నపేట, అక్టోబర్ 25 : 60 ఏండ్లలో ప్రతిపక్షాలు చేయని అభివృద్ధిని, సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి, దేశానికే తలమానికంగా నిలిపారని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని గండిపల్లి, పంచరాయితండా, అంబతండా, డాక్యతండా, సరిరాం తండా, రామవరం, బంగారులొదితండా, చౌటకుంటతండా, కుందనివానిపల్లి, మబ్బుకుంట, మైసమ్మవాగుతండా, బొడిగపల్లి, గౌరవెల్లి, కెప్టెన్ కాలనీ, జనగామ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు అధికార దాహంతో ఉన్నాయని, ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తు వస్తారన్నారు. కాంగ్రెస్కు ఒక్క చాన్స్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్రంలో 50 ఏండ్లు ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ ప్రజల శ్రేయస్సు, సంక్షేమాన్ని విస్మరించి, అన్నింటిలో స్కామ్లకు తెరలేపుతూ కాలం వెల్లదీశారన్నారు. ఇప్పుడు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ఒక్క చాన్స్ అంటూ అడగడం విడ్డూరంగా ఉందన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోఉన్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లు నిధులు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఆరువేల ఎకరాలకే సాగునీరు అందుతున్నదన్నారు. దశాబ్దాల నాటి ఈ ప్రాంత ప్రజల ప్రాజెక్టు కలను ప్రతిపక్షాలు ఆగం చేశాయన్నారు. ప్రాజెక్టు ప్రారంభిస్తే ఓట్లు పడవని, రాజకీయ కుట్రతో తుది దశలో ఉన్న ప్రాజెక్ట్పై కేసులు, ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పి, డిపాజిట్లు గల్లంతు అయ్యేలా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు, ఎంపీపీ మాలోత్ లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్యా మంగ, మండల ఇన్చార్జిలు మ్యాక నారాయణ, కాసర్ల అశోక్బాబు, లింగాల సాయన్న, మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్ తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలోత్ బీలూనాయక్, రామచంద్రం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కందుల రాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.