రామాయంపేట రూరల్, మార్చి 12: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, భూగ ర్భ జలాలు తగ్గడంతోనే సమస్యలు వస్తున్నాయని రామాయంపేట ట్రాన్స్కో ఏడీఈ సుధాకర్ అన్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కరెంట్ ట్రిప్తో కాలుతున్న మోటర్లు’.. అనే శీర్షికకు స్పందించిన విద్యుత్ అధికారులు మంగళవారం రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజన పెద్ద తండాను సందర్శించారు.
గిరిజన రైతుల పంట పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు గిరిజన రైతులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటి మోటర్లు కాలిపోవడంతోపాటు బోరుబావుల మోటర్ల నుంచి నీరు సరిగ్గా పైకి రాకపోవడంతోనే సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు.ఇప్పటి వరకైతే విద్యుత్ సమస్యలు తమ దృష్టికి రాలేదని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. ఏడీఈ వెంట ఏఈ పెంట్యా నాయక్, లైన్మెన్ రాజు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీశైలం తదితరులు ఉన్నారు.