సిద్దిపేట అర్బన్, మార్చి 27: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుతామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. సిద్దిపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పదేండ్లలో ఈసారి మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైందని, కరువుకు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ కారణం కాదన్నారు. దానిని రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల 2022 కంటే 2023లో తక్కువ వర్షపాతం నమోదైందని, మాజీ మంత్రి హరీశ్రావు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. త్వరలో ఐదు ఎకరాల్లోపు ఉన్న వారందరికీ రైతుబంధు అందజేస్తామన్నారు. రైతుల కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. పంట బీమా లేక రైతులు నష్టపోతున్నారని.. ఆ దిశగా చర్యలు చేపట్టామన్నారు. తాగునీటికి సమస్యలు రాకుండా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ, డీసీసీ ప్రెసిడెంట్ నర్సారెడ్డి, పాల్గొన్నారు.