చేర్యాల, ఫిబ్రవరి 20: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు వివక్ష చూపిస్తే ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్ హాలులో మంగళవారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందాల్సిన పథకాలు, కార్యక్రమాలను అధికార పార్టీ మార్చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. అధికారులు ఎలాంటి వివక్ష, నిర్లక్ష్యం చూపించినా తన దృష్టికి తీసుకురావాలని, ఎక్కడికక్కడ ప్రశ్నించాలన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించానని, త్వరలోనే కోరిక నెరవేరుతుందని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, పార్టీ మండల, టౌన్ అధ్యక్షులు అనంతుల మల్లేశం, మేక సంతోశ్, ముస్త్యాల నాగేశ్వర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, కౌన్సిలర్ మంగోలు చంటి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, గోనే హరి, మంచాల కొండయ్య, తలారి కిషన్, యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, మండల మహిళా అధ్యక్షురాలు మీస పార్వతి, రాష్ట్ర నాయకురాలు పచ్చిమడ్ల మానస, ముత్యం నర్సింహులు, గొల్లపల్లి కిష్టయ్య, బొంగు రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన జర్నలిస్టు అనుముల నర్సిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఎమ్మెల్యే పల్లా ఆయనను పరామర్శించారు. అనంతరం కొద్ది రోజుల క్రితం షెటిల్ కోర్టులో జారిపడి గాయపడిన చేర్యాల పట్టణానికి చెందిన జర్నలిస్టు ఓరుగంటి శ్రీకాంత్ను కలసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.