రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ‘ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గ కేంద్ర రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తమ నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రాల పూరింపులో ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి తహసీల్ స్థాయి అధికారిని అందుబాటులో ఉంచాం. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే 1950 టోల్ఫ్రీ నెంబర్తో పాటు సీవిజిల్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. నేటి నుంచి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది’.. అని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడారు.
ఎన్నికల అధికారి : జిల్లాలో 1,151 పోలింగ్ బూత్లు ఉన్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం పోలింగ్ బూత్లు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి. వృద్ధ్దులు, దివ్యాంగులు, పిల్లలు ఉన్న మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వృద్ధ్దులు, దివ్యాంగులకు సహాయం చేయడానికి ఒక సిబ్బందిని కేటాయిస్తున్నాం. జిల్లాలో 80 ఏండ్లకు పైబడిన ఓటర్లుగా ఉన్నవారు, ఫామ్-12 నింపిన వారికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఉంది. నేటి వరకు 3,800 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది.
ఎన్నికల అధికారి : సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు రూ.1.72 కోట్ల నగదు, 12 వేల లీటర్ల మద్యం, 300 కిలోల గంజాయితోపాటు ఇతర సామగ్రిని పట్టుకున్నాం. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా సామాజిక బాధ్యతగా ఓటు వేయాలని నా సూచన. రాజకీయ పార్టీ ఏదైనా ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేయాలంటే 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలి. సువిధ యాప్లో 48 గంటల ముందు కచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి.
జిల్లా ఎన్నికల అధికారి : జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రాల్లోని రిటర్నింగ్ కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశాం. ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల వరకు అభ్యర్థులకు సంబంధించి మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్ వేయడానికి కార్యాలయంలోకి అభ్యర్థితోపాటు నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. పోటీచేసే అభ్యర్థులకు అవగాహన కల్పించడానికి ఒక అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. శుక్రవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 13న స్క్రూటినీ ఉంటుంది. ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.
నమస్తే తెలంగాణ : ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఏర్పాటు చేసిన బృందాలు ఏ విధంగా పని చేస్తున్నాయి?
ఎన్నికల అధికారి: జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పకడ్బందీగా ఎన్నికల కోడ్ను అమలు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికీ 3 ఫ్లయింగ్ స్కాడ్లు, 3 మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్లు, 3 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు, ఒక వీడియో సర్వైలెన్స్ టీమ్లు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగిందని తెలిస్తే ఈ బృందాలు తొందరగా సంఘటనా స్థలానికి వెళ్లి చర్యలు తీసుకుంటాయి. ఇప్పటివరకు జిల్లాలో 80 కేసులు నమోదు చేశాం.
ఎన్నికల అధికారి : జిల్లాలో ప్రతిసారి ఓటింగ్ శాతం ఎక్కువగానే ఉంటున్నది. గత పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో 84శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర స్థాయిలో 73శాతం మాత్రమే నమైదైంది. ఓటింగ్ 86శాతానికి చేర్చాలని ప్రయత్నం చేస్తున్నాం. సిద్దిపేట చాలా చైతన్యవంతమైన జిల్లా. ఎక్కువ మంది స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తారు. జిల్లాలో 82 వేల కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఇందులో 18 వేల మంది యువ ఓటర్లు ఉన్నారు. వారు ఎంతో ఉత్సాహంగా ఓటు వేసేందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
ఎన్నికల అధికారి : ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. ఒక్క ఓటుతో ఏమి జరుగుతుంది అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలి.