మెదక్ అర్బన్/పాపన్నపేట, జూలై 18 : ప్రపంచానికి మెదక్ చరిత్ర తెలియజేస్తానని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపు మేరకు శనివారం మెదక్లోని ఖిల్లాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిని ఆయన సందర్శించారు. ఏడుపాయల ఆలయాన్ని సందర్శించి, వనదుర్గమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్ర తెలిపేందుకు పర్యాటకశాఖ కృషి చేస్తున్నదన్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్న మెదక్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు.
మెదక్ జిల్లాలో ఇలాంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తనకు తెలియదన్నారు. ఈ ప్రాంతంలో సినిమా షూటింగులు చేసేందుకు ప్లాన్ చేస్తామని, పర్యాటక కేంద్రాల్లో వసతులు కల్పించాలని అధికారులను ఆయన కోరారు. మెదక్ పట్టణంలోని చర్చిలో మంచు విష్ణు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏడుపాయల ఆలయ పరిసరాలు సినిమా షూటింగ్లకు స్పాట్గా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడుపాయల ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మికతకు నిలయం అన్నారు. జిల్లాలోని ఏడుపాయల ఆలయం, మెదక్ చర్చి, ఖిల్లా, పోచారం అభయారణ్యాన్ని కలుపుతూ టూరిజం స్పాట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.