పటాన్చెరు, ఏప్రిల్ 10: మెదక్ గడ్డా.. గులా బీ అడ్డా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని సిద్ధి వినాయక దేవస్థానంలో బీఆర్ఎస్ ప్రచార రథాలకు ఆయన పూజలు నిర్వహించి ప్రారంభించారు. హరీశ్రావుతో పాటు ఈ కార్యక్రమంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ఒక్కటీ సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. ఆరు గ్యారెంటీల అమలు చేస్తామని రాహుల్, ప్రియాంకాగాంధీ మాటిచ్చారని, 120 రోజులు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనపై కేసీఆర్ ప్రశ్నిస్తే కాంగ్రెసోళ్లు అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. మెదక్ ఎంపీ స్థానం 2004 నుంచి బీఆర్ఎస్ ఖాతాలో కొనసాగుతోందన్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమని హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు.
వెంకట్రామిరెడ్డి లోకల్ అని, పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్లో ఆయన నివసిస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వారింట్లోనే 38 ఓట్లు ఉన్నాయని, ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 38 ఓట్లు పడ్డాయన్నారు. 11 ఏండ్లపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందన్నారు. ఉన్నత విద్యావంతుడు వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుంటే మనకు మెరుగైన సేవలు లభిస్తాయని తెలిపారు. దుబ్బాక నుంచి అనాథ పిల్లలు వచ్చి కలిస్తే వారిని ఆదుకున్న గొప్ప మనసున్న వ్యక్తి అని ఆయన కొనియాడారు. సిద్దిపేటలో హమాలీ కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు వస్తే ఫీజు కట్టి అండగా నిలిచారన్నారు. రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని హామీని వ్వడం ఆయన దానగుణానికి నిదర్శమని హరీశ్రావు పేర్కొన్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రజలకు ఎడ్లు, నాగలి, నిరుద్యోగ భృతి, రైలు అంటూ అనేక హామీలు ఇచ్చిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ను గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించి తగిన గుణపాఠం చెప్పారని, మోసం చేసినందుకు కర్రుకాల్చి వాత పెట్టారని హరీశ్రావు అన్నారు. దుబ్బాక ప్రజల తీర్పునే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు బీజేపీ అభ్యర్థికి ఇస్తారని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి గుణగణాలు మీకందరికీ తెలిసిందేనన్నారు. గణేశ్గడ్డ అచ్చొచ్చిన గడ్డ అని, బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ గెలుపుకోసం పనిచేయాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో వెంకట్రామిరెడ్డికి మంచి మెజార్టీ రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బూత్ స్థాయి నుంచి బీఆర్ఎస్కు క్యాడర్ ఉందని, సమన్వయంగా పనిచేసి మెదక్లో బీఆర్ఎస్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కుటుంబంపై జరుగుతున్న కుట్రలను హరీశ్రావు ఖండించారు. ఎమ్మెల్యే సోదరుడికి సమస్య వచ్చిన సమయంలో అరగంటలో తాను పటాన్చెరు చేరుకుని అండగా నిలిచానని గుర్తు చేశారు. ఎవరికి కష్టం వచ్చి నా తప్పకుండా అండగా నిలుస్తామని హరీశ్రావు భరోసా ఇచ్చారు.
అధికారిగా పనిచేసిన తనకు ప్రజా సమస్యలు తెలుసని, తనను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నా రు. కలెక్టర్గా, వివిధశాఖల అధికారిగా జిల్లా లో సేవలందించానని గుర్తు చేశారు. గెలిపిస్తే నిరంతరం మీ మధ్య ఉండి సేవలందిస్తానని హామీ ఇచ్చారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. తనకు ఎంపీగా సేవచేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను వెంకట్రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
రుద్రారం సిద్ధి వినాయకుడి దేవస్థానం వద్ద పూజలు చేసి ప్రచారం ప్రారంభించామని, తప్పకుండా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపీగా నిలబడడం మనందరికీ గర్వకారణమని, వెంకట్రామిరెడ్డిని గెలిపించి సీఎం కేసీఆర్కు గిఫ్ట్గా అందజేస్తామన్నారు. నియోజకవర్గంలో 4లక్షల 10వేల ఓట్లున్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేస్తే తప్పకుండా భారీ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనెల 13న పటాన్చెరులో జరిగే నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ ప్రచారంపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. గెలుపే ధ్యేయంగా ముందుకు పోదామన్నారు.