కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై బాదుడుతో అన్నింటిపై ధరల ప్రభావం చూపిస్తున్నది. రెండేండ్ల నుంచి కరోనాతో ఉక్కిరిబిక్కిరైన సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపుతున్నది. కూరగాయల ధరలు నెల రోజులుగా భగ్గుమంటున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏ కూరైనా కిలోకు రూ.60పైనే పలుకుతున్నది. కేజీ టమాట రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది. ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ధరల పెరుగుదలకు ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఒక కారణమైతే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మరోకారణం.. రోజురోజుకూ కేంద్రం ధరలు పెంచుకుంటూ పోతుండగా, ప్రజానీకం మండిపడుతున్నది. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నది.
సిద్దిపేట, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి), మెదక్/సంగారెడ్డి (నమస్తే తెలంగాణ) : ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు.. కూరగాయల మార్కెట్కు వెళ్లితే రూ.వందకు కిలో స రుకులు కూడా రావడం లేదు. రోజు రోజుకూ ధరలు మండిపోతున్నా యి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశనంటుతున్నాయి. కూరగాయలు పండించిన రై తుకు మాత్రం ఏం లాభం లేదు.
ప్రయాణ ఖర్చులు భారం అధికం అవు తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అన్నింటిపై పడుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. కూరగాయలు, పప్పులు, నూనెలు ఇలా ప్రతి ఒక్కదాని ధరలు పెరగడంతో సామాన్య కుటుంబాలకు పోషణ ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. రోజు కూలీ నాలి చేసికొని బతికే కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇంటి అద్దెలు కూడా విపరీతంగా పెంచారు. చికెన్, మటన్ ధరలు కూడా బాగా పెరిగాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని తూప్రాన్, నర్సాపూర్, ఆందోల్, జహీరాబాద్, పటాన్చెరు, నారాయణఖేడ్ పట్టణాల్లో ఉన్న ధరలను చూస్తే సరాసరిగా ఇలా ఉన్నాయి. కిలో టమాట రూ. 80, మిర్చి కిలో రూ.50, కాకరకాయ కిలో రూ.30, బీరకాయ కిలో రూ.40, చిక్కుడు కిలో రూ.40, బీర్నిస్ కిలో రూ.120, క్యారెట్ కిలో రూ.60, బెండకాయ కిలో రూ. 40, పాపిడి చిక్కుడు కిలో రూ.44, చామగడ్డ కిలో రూ.50, క్యాబేజీ కిలో రూ.80, క్యాప్సికం కిలో రూ.50 ఇలా తదితర కూరగాయల ధరలు రోజురోజుకూ మారుతున్నాయి.
రెండు జిల్లాల్లో నలుదిక్కులా నాలుగు రేట్లు ఉన్నాయి. ఎక్కడి ప్రాంతాన్ని బట్టి అక్కడ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీనికి అంత కారణం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో అన్ని రకాల వాటిపై ప్రభావం పడింది. చికెన్ కిలో రూ.280 నుంచి రూ.300 అమ్ముతున్నారు. మటన్ కిలో రూ.750 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. మరో వైపు వంట నూనెల ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్కో ప్యాకెట్పై సరాసరిగా రూ.80 నుంచి 100 వరకు పెరిగాయి. సన్ప్లవర్ ఆయిల్ లీటరు రూ.192 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి వస్తుంది. పామాయిల్ లీటరు రూ.156 నుంచి రూ.165 వరకు ధర పెరిగింది. పల్లీ నూనె గతంలో లీటరు వందలోపు ఉండగా ప్రస్తుతం రూ.185 దాటింది. పాత స్టాక్ను సైతం కొత్త ధరల ప్రకారం అమ్ముతున్నారు. ఇక కంది పప్పు కిలో రూ.106, పెసర పప్పు కిలో రూ.105, శనగ పప్పు కిలో రూ.70, మినప పప్పు కిలో రూ. 106 ధరలున్నాయి. నూనెలను కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ కొరతను సృష్టి స్తున్నారని పలు పట్టణాల్లోని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కృత్రిమ కొరతను సృష్టించి అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పేద ప్రజలు విలవిల లాడుతున్నారు. చాలీచాలని జీతాలతో గడుపుతున్న కుటుంబాలపై భారం పడుతున్నది. నెలకు సరిపడా ఇంటి సరుకులు ఇతరత్రా ఖర్చులకే తమ జీతాలు సరిపోతున్నాయని పలువురు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుడికి తెలియకుండానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న రష్యాపై ఐరోపా దేశాలు తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించడంతో చమురు ధరలు పెరిగి పలు దేశాలపై ప్రభావం పడింది. ఇదే అదనుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటు పోతునే ఉన్నది.
పెట్రోల్, డీజిల్పై బాదుడే బాదుడు
రెండేండ్ల నుంచి కరోనాతో ఉక్కిరిబిక్కిరైన సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపుతున్నది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నది. ప్రస్తుతం సంగారెడ్డిలో పెట్రోల్ ధరలను పరిక్షీస్తే లీటరు పెట్రోల్ ధర రూ. 119, డీజిల్ లీటరు ధర రూ.105.49పై ఉంది. ఇది కాస్తా, దూరం పెరిగిన కొద్ది ధరలలో వ్యత్యాసం ఉంటుంది. దీంతో సామన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు బయటకు వాహనం తీయాలంటే జంకుతున్నారు. ఇవాళ ఉన్న ధర రేపు ఉంటలేదు.. రేపు ఉన్న ధర ఎల్లుండి ఉండదు.. ఏ రోజు ధరలు ఆరోజే సవరిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలతో ఆడుకుం టున్నది. ఇవాళ వాహనం లేకుండా ఏ ఒక్కరు లేరు. రోజురోజుకూ వాహనాల వినియోగం పెరిగింది. పెరుగుతున్న జనాల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు సరిపడడం లేదు. పైగా ప్రతి ఒక్కరూ సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ఎక్కువగా వాడుతున్నారు. ఇక ప్రస్తుతం పెరిగిన ధరలతో సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఉక్రెయన్, రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రోజురోజుకూ సిమెంట్, స్టీల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇంటి నిర్మాణాలు ప్రారంభించని వారిపై ధరల పెరుగుదల పెను భారం మారింది. సిమెంట్ ధరను చూసుకుంటే అన్ని రకాల సిమెంట్లు సరాసరిగా ప్రతి బస్తాపైన రూ. 60-80 వరకు పెరిగింది. ధరలు పెరగడంతో నిర్మాణ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. నిర్మాణ రంగాలతో పాటు వివిధ అభివృద్ధి పనులపై కూడా పెను భారం పడిందని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగాయిని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రస్తుత సమయం నిర్మాణాలకు అనుకూలమైన సమయం కావడంతో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. సిమెంట్ ధరలు చూస్తే రూ.360 నుంచి రూ.420 వరకు ఉన్నాయి. ఇంకా కొన్ని బ్రాండ్ సిమెంట్ ధరలు బాగానే ఉన్నాయిని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు కుమ్మక్కై ధరలను ఇష్టారీతిగా పెంచారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఏది ఏమైనా సామాన్యులను ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఎట్లా బతకాలి..
బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె ధరలు రోజురోజుకూ పెరుగుతుంటే ఎట్లా బతకాలో అర్థమైతలేదు. గ్యాస్ ధర రూ. 1052కు చేరింది. ఒకప్పుడు వారం రోజుల ఖర్చు ఇప్పుడు రెండు రోజులకే వస్తుంది. పెరుగుతున్న ధరలను కంట్రోల్ చేయాలి.-నగేశ్, సదాశివపేట
గ్యాస్నూనె తీసేసి గ్యాస్మొద్దును అంటగట్టిండ్రు..
మాలాంటి చిన్న కుటుంబాలు గ్యాస్నూనెతోనే వంటలు చేసుకునేటోళ్లం. గ్యాస్నూనె బంద్ జేసి గ్యాస్మొద్దును మాకు అంటగట్టిండ్రు. ఫ్రీ అని చెప్పిండ్రు. ఇప్పుడు రూ.వెయ్యి పైనే పెంచిండ్రు. గ్యాస్, పిట్రోలు, డీజిల్ రేట్లు పెంచి మాలాంటోళ్లు బతుకకుంట జేసిండ్రు. ఉన్నోళ్లు మంచిగనే బతుకుతరు. లేనోల్లు బతుకుడే కట్టమైతంది. కేంద్రంలోని సర్కారు చేయ్యబట్టి పేదోల్ల బతుకులు ఆగమౌతున్నయి.
– ఎలువాక చంద్రకళ, గృహిణి, హుస్నాబాద్
గా.. కేంద్ర సర్కార్ తీరుతోనే..
గా.. బీజేపోళ్లు పెంచుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో మేం ఏది కొందామన్న మండుతున్న ధరలతో కష్ట పడుతున్నాం. గింతగనం ధరలు పెరుగుడు నేను ఎప్పుడూ సూడలేదు.. గా కేంద్ర బీజేపీ సర్కారు తీరుతోనే ప్రజలకు ఎన్నో కష్టాలు మొదలైనయి.. ఏది కొందామన్న అగ్గొలే మండుతున్నాయి. పొద్దంతా చేసిన కష్టం కాకుల పాలైనట్లుగా ఉంది మా బతుకు. ఇప్పటికైన కేంద్ర సర్కారు పెంచిన ధరలను దించాలని కోరుతున్నం.
– ర్యాకం స్వరూప, గృహిణి, మిరుదొడ్డి
కిరాణ సామాను కొనలేని పరిస్థితి..
రోజు రోజుకు పెరుగుతున్న అధిక రేట్ల వల్ల పేద, మధ్యతరగతి వాళ్లం ఇంట్లో సామాను కొనలేని, తినలేక పోతున్నాం. చిన్నపాటి ఉద్యోగం చేసేవాళ్లకు ఇంతింత ధరల వల్ల ఒక పూట తిని మరో పూట పస్తు లు ఉండాల్సిన పరిస్థితి. ధర లు అందుబాటులో ఉంటే సామాన్యులతో పాటు అందరికీ బావుంటుంది.
– సతీష్, ప్రైవేటు ఉద్యోగి, సదాశివపేట
రేటు చూస్తే భయమైతాంది
ఏ కూరగాయ ముట్టుకున్నా రేటు చెప్పంగనే భయమైతాంది. కూరగాయల ధరలు టమాటలు కొనాలంటే మనసొస్తలేదు. రూ.60కు కిలో అంటున్నారు. ఏ కూరగాయ తిన్నాలన్నా రూ.30 కంటే ఎక్కువగానే ఉన్నది. ఇటు ఎండాకాలం, అటు కూరగాయలకు మార్కెట్లకు తెచ్చే ఆటోలకు ఎక్కువ పైసలు అవుతున్నాయి అనుకుంట. రూపాయి కూడా తక్కువ చేస్తలేరు. దబ్బున వానలు పడితేనన్న తక్కువ అయితయేమో సూడాలి. ధరలు ఇలా మండితే బతకడం చాలా కష్టమైతాది.
– బాలామణి, గృహిణి, గజ్వేల్
కొనబోతే కొరివి అమ్మబోతే అడవి
కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా మారింది. వంట నూనె ధరలు రోజు రోజుకు బగ్గుమంటున్నాయి. నూనె కొనాలంటేనే భయం వేసి స్థితికి వచ్చింది. గతంలో వంట నూనెలు 100నుంచి 110 వరకు మాత్రమే వుండేది. ప్రస్తుతం ఒక కిలో నూనె రూ. 180 నుంచి 200 వరకు పెరిగిపోవడంతో సామన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నూనె ధరలపై కట్టడి చేయకుంటే మున్ముందు ఇబ్బందులు తప్పెల లేవు.
– సంగమేశ్వర్ (మాయికోడ్)
సామాన్యులపై భారం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యం ధరలు పెంచుతూ సామన్యూలపై పెనుభారం వేస్తున్నది. పెట్రోల్, డీజిల్తో పాటు వంట గ్యాస్ ధరను పెంచి మహిళలకు కన్నీళ్లు పెట్టిస్తున్నది. నిత్యవసర ధరల పెరుగుదలతో ప్రజలు నేడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటనూనె ధరలు పెంచింది. ఈ కేంద్ర ప్రభుత్వ చర్యలతో ముఖ్యంగా ధరల పెరుగుదలతో ఏం కొనేటట్టు లేం.. ఏం తినేటట్టు లేం.. అనే విధంగా తయారైంది.
– కే. పద్మ, గృహిణి, జక్కాపూర్, సిద్దిపేట
వ్యాపారానికి ఇబ్బంది అయితాంది..
ఎప్పుడూ లేనంతగా కూరగాయల ధరలు పెరిగినయి. వ్యాపారానికి చాలా ఇబ్బంది అయితాంది. ఇటు కూరగాయలు.. అటు కిరాణ సరుకుల ధరలు బాగా అయినయి.. పాత ధరలకు హోటళ్లలో భోజనాన్ని ఇయ్యలేక పోతున్నం. చేసిన పనికి కూలీ కూడా గిట్టుబాటు అయితలేదు. ఇలా ఉంటే మెస్ ధరలను కూడా పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. కానీ, మధ్యతరగతి వాళ్లు హోటళ్ల భోజనం చేయాలంటే భయపడతారు. ధర తగ్గించాలని కిరాణ వ్యాపారులను అడిగితే, డీజిల్ రేటు పెరిగి ట్రాన్స్పోర్ట్ భారమైందని అంటున్నరు. తొందరగా ధరలన్నీ తగ్గాలని దేవున్ని కోరుకుంటున్న.
– రమాదేవి, హోటల్ నిర్వాహకురాలు, గజ్వేల్
ధరలు తగ్గించాలి..
పనులు లేక పూటగడవడమే కష్టంగా ఉంటే పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు వివరీతంగా పెరిగాయి. రూ. 3వేలకు నెలకు సరిపడ కిరాణ సామాను వచ్చేది. ఇప్పుడు రూ. 5వేలు ఖర్చుచేయాల్సిన దుస్థితి. మా లాంటి పేదలు బదికేదెట్లా. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలి.
– రవికాంత్, సదాశివపేట