తూప్రాన్, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం ఓ యజ్ఞంలా కొనసాగుతున్నదని, ఈ కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం తూప్రాన్ మండల పరిధిలోని గుండ్రెడ్డిపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన సర్పంచ్ శ్రీలతా రాజిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల దృష్టిలోపాలు నివారించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు.
25 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మందికి కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించారని, ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలోనే దాదాపు 44 వేల మంది ప్రజలు కంటి పరీక్షలు చేయించుకుని, కంటి అద్దాలు తీసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,533 కేంద్రాల ద్వారా కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నదని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ జడ్పీటీసీ రాణి సత్యనారాయణగౌడ్, ఎంపీపీ గడ్డి స్వప్నావెంకటేశ్ యాదవ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గొల్లపల్లి సురేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాచిరెడ్డి కృష్ణారెడ్డి, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.