మెదక్ మున్సిపాలిటీ/గుమ్మడిదల/ కంది, జనవరి 1: హిందువుల అత్యంత పవిత్రంగా జరుపుకొనే పండుగల్లో వైకుంఠ ఏకాదశమిని ప్రముఖంగా పేర్కొనవచ్చు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంతో మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ఏటా 24 ఏకాదశిలు వస్తుంటాయి. అందులో సూర్యగ్రమనం ప్రకారం ధనుర్మాసంలో శుక్లపక్షమి ఏకాదశి అని, పుత్రత ఏకాదశి అని పిలుస్తారు. శ్రీహరికి ఇష్టమైన ప్రదేశం వైకుంఠం. ఇష్టమైన తిథి ఏకాదశి. అలాంటి ఏకాదశుల్లో అత్యంత ప్రాధాన్యమున్నదే వైకుంఠ ఏకాదశి. స్వర్గధామం, ముక్కోటి ఏకాదశి అని పిలిచే ఈ ఏకాదశిని వైష్ణవ ఆలయాల్లో అత్యంత వైభవంగా జరుపుతారు.
ఉత్తర ద్వార దర్శనం.. మోక్షదాయకం
మహావిష్ణువుకు ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో విష్ణువును దర్శించుకోవడం మోక్షదాయకమని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున వైకుంఠ సప్తద్వారాలు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారంగా భావించి వేకువజాము నుంచే భగవత్ దర్శనార్థం భక్తులు నిరీక్షిస్తారు. ఇదే రోజున మహావిష్ణువు గరుడ వాహనారుడై ముక్కోటి దేవతలతో కలిసి భువికి దిగివచ్చి దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. ఈరోజు సూర్యోదయానికి ముందే స్నాన, సంద్యాధులు పూర్తి చేసుకొని దేవాలయానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే ఆ పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారని భక్తుల నమ్మకం.
పాల సంద్రాన్ని చిలికిన రోజు..
పాల సంద్రాన్ని దేవదానవులు చిలకగా ముక్కోటి ఏకాదశి రోజునే హాలాహలం, అమృతం కూడా ఉద్భవించాయట. ఈ విధంగా ఉద్భవించిన హాలహలాన్ని దేవతల కోరిక మేరకు పరమశివుడు మింగి గరకంతుడిగా పేరు పొందాడు. సంద్రం నుంచి లభించిన అమృతాన్ని విష్ణుమూర్తి దేవతలకు పంచాడని చెబుతారు. ఇదే రోజున జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించాడని ప్రతీతి. విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు అసురుల అభ్యర్థన మేరకు ముక్కోటి ఏకాదశి రోజునే వైకుంఠ ద్వారాలు తెరిచి విష్ణుదర్శన భాగ్యం కల్పించారట. ఈ రోజు విష్ణువును జాజి పూలతో అర్పించడం, పాయసం వంటి తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లు నైవేద్యంగా సమర్పించి పూజించడం శుభప్రదమని వేదపండితులు చెబుతున్నారు.
కంది : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామి వారి కోసం పూల మాలలు అల్లుతున్న భక్తులు
ఏకాదశ వ్రత నియమాలు..
దశమినాటి రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండాలి. సత్యవ్రతాన్నే వచించాలి. అబద్ధ్దాలు చెప్పరాదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. చెడు పనులు, దుష్ణతలంపులు చేయరాదు. ఈ రోజంతా జాగరణ చేయాలి. ఏకాదశినాడు తమ శక్తానుసారంగా అన్నదానం చేయాలి.
దర్శనం ఉదయం 4 గంటల నుంచే..
ఉత్తర ద్వార దర్శనం వేకువజామునే (ఉదయం 4 గంటల నుంచి) ప్రారంభమై రోజంతా కొనసాగుతుంది. ఉదయం పది గంటలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని వేద పండితులు తెలుపుతున్నారు. ఈ రోజున విష్ణు భగవానుడిని ప్రసన్నం చేసేందుకు ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని జిల్లాలోని పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి.
ఉత్తర దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం 4 గంటలకు మెదక్ జిల్లా కేంద్రం మెదక్లోని కోదండ రామాలయం, వేంకటేశ్వర దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తుల దర్శించుకునేందుకు ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు హాజరు కానున్నట్లు ఆయా ఆలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు.
మురాసురుడి కథ..
కృతాయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలను తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించుమని ప్రార్థించారు. విష్ణువును మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించారు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్లి సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుడిని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించిడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గా రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుడిని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది.
వైకుంఠపుర దివ్య క్షేత్రంలో..
సంగారెడ్డి శివారులోని వైకుంఠ పుర దివ్య క్షేత్రం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబైయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం 3గంటల నుంచే ఆలయంలో శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 5గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని పలు రకాల పూలు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ ఆవరణలో చిన్నారుల కోసం జెయింట్ వీల్, రంగుల రాట్నం తదితర ఆడవిడుపులను ఏర్పాటు చేశారు. అదే విధంగా సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ బాలాజీ ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉత్తరద్వార దర్శనం చేసుకోవాలి
వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు కలుయుగదైవమైన కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని ఉత్తరద్వార దర్శ నం చేసుకోవాలి. దీని ద్వారా భక్తులకు సుఖసంతోషాలు, ఐష్టెశ్వర్యాలు కలుగుతాయి. పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. ఈ రోజు ల ఉపవాసం, జాగరణ చేయాలి. బి య్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. పిండితో చేసిన వంటకాలను భోజనం చేయాలి. నారాయణ నామస్మరణ చేసుకోవడం శుభప్రదం. గుమ్మడిదలలోని శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి, సంగారెడ్డి జిల్లాలోని వైకుంఠపురంలో కల్యాణవేంకటేశ్వరస్వామి వారు ఉత్తరద్వార దర్శనం ఇవ్వనున్నారు. భక్తులందరూ వైష్ణవాలయాల్లో గడిపితే శుభప్రదంగా ఉంటుంది.
– కేవీ.నర్సింహాచార్యులు, శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి అర్చకుడు, గుమ్మడిదల