సంగారెడ్డి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ): అకాలవర్షాలు రైతులపాలిట ఆశనిపాతంలా మారుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం కుండపోతగా వర్షం కురవడంతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా రామచంద్రాపురం మండలంలో 13.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అమీన్పూర్లో 10.7 సెం.మీ, పటాన్చెరులో 10.9 సెం.మీటర్ల వర్షం కురిసింది. జిన్నారంలో 5.4 సెం.మీ, నాగల్గిద్ద మండలంలో 5 సెం.మీ, సంగారెడ్డిలో 3.6 సెం.మీ, కందిలో 3.3 సెం.మీ, కొండాపూర్లో 3.1 సెం.మీ, కోహీర్, నారాయణఖేడ్ మండలాల్లో 3 సెం.మీటర్ల వర్షం కురిసింది. చౌటకూరు, గుమ్మడిదల, హత్నూర, అందోలు, జహీరాబాద్, మొగుడంపల్లి, మనూరు మండలాల్లో 2.5 నుంచి 2.0 సెం.మీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రామచంద్రాపురం, పటాన్చెరు, అమీన్పూర్లో జనజీవనం స్తంభించిపోయింది. జాతీయ రహదారి 65పై పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వర్షాలతో పంటలకు నష్టం
వడగండ్ల వాన కారణంగా జిల్లాలో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయశాఖ అధికారులు బుధవారం పంటనష్టంపై సర్వే నిర్వహించారు. ఎక్కువగా వరి, జొన్న పంటకు నష్టం వాటిల్లగా, గాలి తీవ్రతతో మామిడి పంటకు నష్టం జరిగింది. సుమారు 50 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. వ్యవసాయశాఖ అధికారుల ప్రాథమిక సమాచారం మేరకు కల్హేర్ మండలంలో 66 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. నిజాంపేట మండలంలోని దామరంచ, బాచేపల్లి, నాగధర్, ఖానాపూర్(బి), కొత్తపేట, రాంరెడ్డిపేట గ్రామాల్లో 250 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్, సదాశివపేట, కంది మండలాల్లో సుమారు 100 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. జోగిపేట మార్కెట్యార్డులో ఆరబోసిన ధాన్యం వర్షం నీటితో తడిసిపోయింది.