కేంద్ర బడ్జెట్ జిల్లాకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచెయ్యి చూపారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతలు, రైల్వేలు, ఇతర అభివృద్ధి పనులకు మన ఎంపీలు పంపిన ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోలేదు. జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడం అటు ప్రజాప్రతినిధులనే కాకుండా ఇటు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిశ్రమ స్పందన వచ్చింది. ఈ బడ్జెట్ సంపన్నులకు కొమ్ముకాసేలా ఉందని, సామాన్యులు, ముఖ్యంగా రైతులు, ఉపాధి కూలీల ప్రయోజనాలను పట్టించుకునేలా లేదని ఆ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అంకెల గారడీ తప్ప ప్రయోజనం లేదని, విద్య, వైద్యానికి పెద్దపీట వేయలేదని, ఈజీఎస్ను నిర్వీర్యం చేసేలా నిధుల కేటాయింపులు ఉన్నాయని పలువురు విమర్శించారు. ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఓట్లకోసం వేతన జీవులకు ఇన్కం ట్యాక్స్ చెల్లింపుల్లో కాస్త ఊరటనిచ్చింది తప్పా, వారిపై నిజమైన ప్రేమలేదని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
సిద్దిపేట, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిశ్రమ స్పందన వచ్చింది. ఈ బడ్జెట్ సంపన్నులకు కొమ్ముకాసేలా ఉందని, సామాన్యులు, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను బీజేపీ కేంద్ర సర్కారు పట్టించుకోలేదని ఆ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అంకెల గారడి తప్ప ప్రయోజనం లేదని, విద్య, వైద్యం కోసం ఎలాంటి కేటాయింపులు లేవని వివిధ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర బడ్జెట్ పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా లేదని, భ్రమలో విహరించేలా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ అన్నివర్గాలను నిరాశ పర్చిందని చెప్పవచ్చు. ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంతో ఓట్లకోసం వేతన జీవులకు ఇన్కాం ట్యాక్స్లో కాస్త ఊరటనిచ్చింది తప్పా, వారిపై నిజమైన ప్రేమలేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండి చేయి…
ఉమ్మడి మెదక్ జిల్లాకు కేంద్రం మొండిచేయి చూపింది. కేంద్ర బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి నిధుల వరద పారలేదు. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాళ రైతాంగానికి సాగునీరు అందిస్తున్నది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కేంద్రానికి మొర పెట్టుకున్నా పెడచెవిన పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగన్నసాగర్ రిజర్వాయర్లను రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మించింది. కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటిస్తే మన జిల్లాకు మేలు జరిగేది. ఈసారి జాతీయ హోదా ఇస్తారేమోనని చూసిన రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. ప్రతిసారి కేంద్ర బడ్జెట్పై ఎదురుచూపులే తప్పా జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో రైల్వే ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ బడ్జెట్లోనైనా ప్రత్యేక నిధులు కేటాయించారా.. లేదా మరో రెండు రోజులైతేగానీ తెలియని పరిస్థితి. మొత్తంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అన్నివర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్పై మంత్రి హరీశ్రావు స్పందించారు. ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశాజనకంగా ఉందన్నారు. తెలంగాణకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఎలాంటి నిధుల కేటాయింపు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
వేతన జీవులకు కాస్త ఊరట…
సీనియర్ సిటిజన్ల డిపాజిట్ పరిమితి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పెంచింది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం వేతన జీవులకు కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం మినహాయింపు పరిమితి రూ.5 లక్షలు ఉన్న దాన్ని రూ.7 లక్షల వరకు పరిమితిని పెంచుతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 5 శ్లాబ్లుగా పన్ను చెల్లింపు విధానాన్ని ప్రకటించారు. ఆదాయం రూ.7 లక్షలు దాటితే పన్ను 5 శ్లాబుల్లో పన్ను చెల్లించాలి. 1) రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను, 2) రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను, 3) రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను, 4) రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను ,5) రూ.15 లక్షలపైబడి ఉంటే 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సిగరెట్లు, బంగారం తదితర వాటి ధరలు పెరగగా, కస్టమ్ డ్యూటీ తగ్గించడంతో టీవీలు, మొబైల్, ఎలక్ట్రానిక్ విడిభాగాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
కేంద్ర బడ్జెట్పై ప్రజల నిట్టూర్పు
రైతులకు తమ ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పిన బీజేపీ పెద్దలు, బడ్జెట్లో రైతులకు ఎలాంటి ప్రయోజనం కలిగేలా పథకాలు ప్రకటించలేదు. బీజేపీ ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి ప్రేమ ఉందో ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిదర్శనం అని చెప్పాలి. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు, రా రైస్ విషయంలో బడ్జెట్లో ప్రభుత్వం ప్రస్తావించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి అండగా ఉన్న ఉపాధి హామీ పథకంలో భారీగా నిధుల కోత పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించలేదు. కనీసం ఒక్క రూపాయి కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లక్షలాది ఉద్యోగాల భర్తీపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇక పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు కల్పించలేదు. బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు ఏమైనా నిధుల వస్తాయేమోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా అక్కన్నపేట, మనోహరాబాద్ రైల్వేలైన్లు ఉన్నాయి. ఇప్పటికే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొత్తంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని చెప్పవచ్చు.
మన ప్రతిపాదనలు బుట్టదాఖలు
సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు చేపడుతున్నది. వీటికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు చేయలేదు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అనేక ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. కానీ, సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతలు, రైల్వేలు, ఇతర అభివృద్ధి పనులకు మన ఎంపీలు పంపిన ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోలేదు. జిల్లాకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడం అటు ప్రజాప్రతినిధులనే కాకుండా ఇటు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచెయ్యి చూపారు. కేంద్ర బడ్జెట్పై జిల్లా మంత్రి హరీశ్రావు సైతం పెదవి విరిచారు. అన్నిరంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై కేంద్రం విక్షతపై ఆయన ఒక టీవీ చానెల్ డిబెట్లో ఖండించారు. కేంద్రం తీరు సరికాదన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, స్వయం ప్రతిపత్తి వాహనాల తయారీపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుపుతున్నది. ఐఐటీ నిర్వహణతో పాటు పరిశోధనలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించక పోవడం పరిశోధనలు, నూతన ఆవిష్కరణపై ప్రభావం చూపనున్నది.
బడ్జెట్.. పేదలకు శాపం, సంపన్నులకు వరం
సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్
సిద్దిపేట కమాన్, ఫిబ్రవరి 1: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలో అసమానతలు పెంచేలా ఉందని, ఇది పూర్తిగా పేదల వ్యతిరేక, సంపన్నుల అనుకూల బడ్జెట్ అని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందిస్తూ బుధవారం సిద్దిపేటలో మాట్లాడారు. ప్రతీ రంగంలో దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా ఈ ఆర్థిక బడ్జెట్ ఉంటుందని ఊహిస్తే.. గతంలో కన్నా దారుణంగా, పేదవారిని మరింత పేదవాళ్లుగా మార్చి, సంపన్నులను మరింత అభివృద్ధి చేసేలా బడ్జెట్ ఉందన్నారు. ఆకలి సూచిలో దేశం 107వ స్థానంలో ఉందని, ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని, నివారణకు ఎలాంటి చర్యలు లేవని, ఉపాధి హామీ పథకం కోసం రెండేళ్ల క్రితం రూ.98 వేల కోట్లు కేటాయిస్తే, గత ఏడాది రూ.90 వేల కోట్లు, ఈసారి కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మైనార్టీలకు ఇచ్చే రాయితీలు నిరుడు రూ.1800 కోట్లు ఉంటే, ఈసారి కేవలం రూ.600 కోట్లే కేటాయించడం దారుణమన్నారు.
ఎప్పటిలాగే విద్యకు, వైద్యానికి, ఉపాధి విషయంలో చిన్నచూపు చూస్తున్నదన్నారు. దేశ అప్పు మాత్రం రూ.లక్షా 55 వేల కోట్ల లెక్కలు చూపుతుందని, గత ప్రభుత్వంలో రూ.55 లక్షల కోట్లు ఉన్న అప్పు, బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల పెరిగిందన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటైజేషన్ చేసే చట్టాలను చేశారన్నారు. ఉపాధి, ఉద్యోగ కల్పనకు అసలు హామీ లేదని, ఇది పూర్తిగా అన్ని వర్గాల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పుకొచ్చారు. అదానీ, అంబానీలకు అనుకూల బడ్జెట్ అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విభజన హామీల ఊసే లేదని, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, గిరిజన వర్సిటీ తదితర అంశాలపై అసలు మాట్లాడలేదన్నారు. ఆశాజనకంగా లేని ఈ బడ్జెట్ను భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తున్నదని మంద పవన్ అన్నారు.
ఉపాధి హామీ పథకం ఎత్తివేతకు బడ్జెట్ కోతలే నిదర్శనం
పేదలకు ఆహార భద్రత, ఆదాయం కల్పిస్తున్న ఉపాధిహామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించి పథకాన్ని ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దేశంలో కూలీలకు పనులు కల్పించేందుకు రూ.3 లక్షల కోట్లు అవసరం ఉండగా రూ.35 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. 2022-23 బడ్జెట్లో రూ.73 వేల కోట్లు కేటాయించి, సవరించిన బడ్జెట్లో రూ.89 వేల 400 కోట్లను కేటాయించగా 2023-24 బడ్జెట్లో రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్తో పోల్చితే రూ.28,600 కోట్లను తగ్గించింది. ప్రస్తుతం కేటాయించిన రూ.60 వేల కోట్లలో రూ.16 వేల కోట్లు తక్షణ బకాయిలకు, మరో రూ.25 వేల కోట్లు ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ సంవత్సరం బకాయిలకు పోగా ఇక మిగతా రూ.35 వేల కోట్లు దేశంలో కోట్లాది మంది కూలీలకు ఏ మూలకూ సరిపోదు.
– పి.శంకర్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి
ధనికుల మీద ప్రేమ చాటుకున్న కేంద్రం
ధనిక, బడా వ్యాపార సంస్థలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రేమను చాటింది. పేదల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రజా రంజక పథకాలను అమలు చేస్తున్న తెలంగాణపై చిన్నచూపు చూసింది. బడ్జెట్ కేటాయింపుల్లో చిన్న తరహా, మధ్యతరహా, చిరు వ్యాపారస్తులకు ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రధానంగా కార్పొరేట్ సంస్థలకు, అతి సంపన్నులకు ఆదాయ పన్ను రాయితీలో వెసులుబాటు కల్పించారు. బడ్జెట్లో ఎంతగానో ఎదురుచూసిన రైతులు, చిరు ఉద్యోగులు, వ్యాపారులను నిరాశ పర్చింది. మొత్తం మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మాటల, అంకెల గారడి తప్ప ఏంలేదు.
– క్రాంతి కుమార్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్
సాగుకు సాయం లేని బడ్జెట్
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయానికి ఏ మాత్రం సాయ చేసేదిగా లేదు. రాష్ట్ర ప్రయోజనాలను బడ్జెట్ లెక్కలోకి తీసుకోలేదు. కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. సామాన్య ప్రజానీకాన్ని, కూలీలను కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పటికైనా కేంద్రం తీరు మార్చుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలి.
– చింతల మల్లేశం, సిద్దిపేట
కేంద్ర బడ్జెట్ పక్షపాతంగా ఉంది
కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ కలిగించింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక విధానం, ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో మరో విధానం అనుసరిస్తూ నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపకల్పన చేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఎయిర్పోర్టు, మెడికల్ కాలేజీల ప్రస్తావనే లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన మాటే మరిచారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లను పోషిస్తూ నిరుద్యోగ భారతాన్ని తయారు చేస్తున్నది. ఇది ముమ్మాటికీ పక్షపాతమైది, ప్రజాకంఠకమైన బడ్జెట్.
-చింతకింది భీంరెడ్డి, బీఆర్ఎస్ నేత, గోవిందాపూర్, వర్గల్
సంపన్నలకు కొమ్ముకాసే బడ్జెట్
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సంపన్నులకు కొమ్ముకాసేలా ఉంది. బడ్జెట్లో సామాన్యులు, రైతుల ఊసే లేదు. బడ్జెట్ మొత్తం సంపన్నులకు అనుకూలంగా ఉంది. కేంద్రం ఏటా ప్రవేశపెడుతున్న బడ్జెట్ అంకెల గారడీగా ఉంది తప్ప విద్య, వైద్యానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ బడ్జెట్ పేదల జీవితాల్లో వెలుగులు నింపేది కాదు.. భ్రమల్లో ఉంచేదిలా ఉంది.
– చింతల జనార్దన్రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు, సిద్దిపేట
నిరాశ పరిచిన బడ్జెట్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ అన్ని వర్గాలకు నిరాశపర్చింది. భారత్ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని ప్రసంగించడం విడ్డూరంగా ఉంది. బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. బడ్జెట్లో పూర్తిగా ఏ రంగానికీ ప్రాధాన్యత ఇవ్వలేరు. ఇది అన్ని వర్గాలను నిరాశపర్చిన బడ్జెట్.
– ఓంప్రకాశ్, ఆర్థిక నిపుణుడు, నాగల్గిద్ద
బడ్జెట్తో ఒరిగిందేమీ లేదు
కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను తీవ్రంగా నిరాశపర్చింది. అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు కేంద్ర బడ్జెట్తో ఒరిగిందేమీ లేదు. కేవలం వేతన జీవులకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకున్నారు. నిత్యం ఉపయోగించే వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులకు ఇబ్బందులు వస్తాయి. నామమాత్రంగా నిధులు కేటాయించి కేంద్రం చేతులు దులుపుకున్నారు. ప్రతి ఏటా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. వ్యవసాయ, సాగునీటి పారుదల, విద్య, వైద్యం తదితర రంగాల కేటాయింపుల్లో ఎలాంటి స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ను రూపొందించడం విచారకరం.
– ఎర్రబెల్లి సుధీర్కుమార్ (లెక్చరర్, చేర్యాల)
రైతులకు లాభం లేదు
గియ్యల్ల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో రైతులకు గాని అటు ఇంకా ఎవ్వలకైనా సరే లాభం లేదు.
గీ బీజేపీ ప్రభుత్వం అచ్చిన నాటి నుంచి అన్ని ధరలు పెరుగుతానే ఉంటున్నాయి. ఏది కొందామ్మన్నా ధరలు పిరముగా ఉన్నాయి. దేశంలోని రైతులను, ప్రజలను దోచుకొని తిని బతికే బీజేపీ ప్రభుత్వం మారితేనే దేశంలోని ప్రజల బతుకులు మారుతాయి. లేదంటే రాను రాను శానా కష్టం అయితది.
– జోగ్గారి బాల్నర్సయ్య,రైతు, లింగుపల్లి (మిరుదొడ్డి)
బంగారంపై కస్టమ్స్ తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్వర్ణకారులకు స్థానం కల్పించినా బంగారానికి సుంకం విధిస్తానని అనడం మంచిది కాదు. ఇలాగైతే స్వర్ణకారులకు పనులు ఉండవు.. బంగారం, వెండి ధరలకు కేంద్రం విధించిన సుంకం తగ్గిస్తేనే మాకు పనులు లభిస్తాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే రోల్డ్గోల్డ్ వస్తువుల వినియోగం పెరిగి మాకు పనులు లేక పస్తులుంటున్నాం.
– ముత్యాల బాలచంద్రం, స్వర్ణకారుడు (రామాయంపేట)
తెలంగాణకు మొండి చేయి..
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మరోసారి తెలంగాణకు మొండి చేయి చూపింది. దేశంలోనే అత్యుత్తమ అభివృద్ధి సంక్షేమ పథకాలకు బడ్జెట్లో ఎలాంటి సహకారం అందించకపోవడం తెలంగాణ మీద మోడీ ప్రభుత్వ వైఖరికి నిదర్శనం. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరానికి కానీ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు కానీ ఒక్క రూపాయీ కేటాయించలేదు. తెలంగాణ తన కాళ్లమీద తాను నిలబడి ఎదుగుతున్నదని మోడీ ఓర్వలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణ దేశంలో మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది. అందుకే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా తెలంగాణ నాయకత్వంలో ఎదగాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు.
– మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్
వేతన జీవులకు మరింత మోసం
కేంద్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్ల నుంచి ఆదాయపు పన్ను స్లాబుల్లో పెంపుదల చేయకుండా పన్ను మినహాయింపుల్లో ఉద్యోగలను ఈ బడ్జెట్ పూర్తి మోసం చేసేలా ఉంది. ఈ బడ్జెట్ ఉద్యోగ వర్గాలను దీంతో ఒరిగేదేమీలేదు. ఈ బడ్జెట్ ఆశనిపాతంగా మారింది. బడ్జెట్ రూపకల్పనను మార్చాలి. అప్పుడే ఉద్యోగార్థులకు న్యాయం జరుగుతుంది. ఇది పూర్తి ఉద్యోగులకు నిరాశ కలిగించేలా ఉంది. దీన్ని కేంద్రం పునఃసమీక్షించి ఉద్యోగులకు న్యాయం చేయాలి.
మత్స్యశాఖకు నిధులు పెంచాలి
కేంద్ర ప్రభుత్వం బుధ వారం నిర్వహించిన బడ్జెట్ సమావేశాలు అసంతృప్తి పరిచాయి. బడ్జెట్లో మత్స్యశాఖకు మరింత సంపదను పెంచాలి. దేశంలోనే మత్స్యకారుల సంఖ్య ఎక్కువ. మత్స్యశాఖకు రూ.6 వేల కోట్లు కేటాయిస్తామనడం సరికాదు. పీఎం మత్స్య సంపద యోజన కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలి.
-దేవుని నర్సింహులు, మత్స్యకారుడు, రామాయంపేట
ఉద్యోగ అవకాశాలపై కంటితుడుపు చర్య
2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సమావేశాల్లో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే విద్యరంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే పనిలో కేంద్రం బిజీగా ఉన్నట్లు తెలుస్తున్నది. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై బడ్జెట్లో కనీసం కంటి తుడుపు చర్యలైనా లేకపోవడం బాధాకరం. ఈసారి బడ్జెట్లో విద్యారంగాన్ని కేంద్రం ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు.
– దాసరి ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి