అందోల్-జోగిపేట జంట పట్టణాల్లో అభివృద్ధి పరుగులుపెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీగా, ఆ తర్వాత నగరపంచాయతీగా ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో 2014లో మున్సిపాలిటీగా ప్రకటించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నారాయణఖేడ్ పర్యటన సందర్భంగా రూ. 25కోట్లు ప్రకటించారు. మంత్రి హరీశ్రావు దిశానిర్దేశంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో ప్రాధాన్యతా క్రమంలో పనులు జోరుగా సాగుతున్నాయి. మొదటి విడుతలో మంజూరు చేసిన నిధులతో రూ. 9.35 కోట్లతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. రూ. 7.30 కోట్లతో చేపట్టిన సీసీ డ్రైనేజీలు చివరిదశలో ఉన్నాయి. రూ.1.90 కోట్లతో కమ్యూనిటీ హాల్స్ పూర్తి కావొచ్చాయి. రూ. 6.45కోట్లతో పట్టణ సుందరీకరణ చేపడుతున్నారు. బతుకమ్మ ఘాట్, మినీ ట్యాంక్ బండ్, చిల్డ్రన్పార్కు ఏర్పాటుతో అందోల్ చెరువు కొత్త రూపును సంతరించుకోనున్నది. వీటితో పాటు స్థానికులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రూ.25కోట్లు కేటాయించడంతో భవిష్యతులో మున్సిపాలిటీ అభివృద్ధిలో నెంబర్ వన్గా నిలువనున్నది.
– అందోల్, ఆగస్టు 13
అందోల్, ఆగస్టు 13: అందోల్- జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంచాయతీగా ఉండి, ఆ తర్వాత నగర పంచాయతీగా రూపాంతరం చెందినా అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందోల్- జోగిపేటను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి, అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మున్సిపల్ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారు. అందోల్-జోగిపేట మున్సిపల్ అభివృద్ధిలో పరుగులు పెడుతూ జంట పట్టణాలు కొత్త కళను సంతరించుకున్నాయి. పట్టణానికి తలమానికమైనా క్లాక్టవర్కు మరమ్మతులు చేసి పూర్వ వైభవం తీసుకొచ్చారు. రోడ్డు మధ్యలో డివైడర్లు నిర్మించి, పచ్చని చెట్లు నాటించి, వాటి మధ్యలో హైమాస్టు లైట్లు ఏర్పాటు చేశారు. ఈ లైట్ల వెలుతురులో పట్టణం మెరిసిపోతున్నది. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడంతో పారిశుధ్య సమస్య తొలిగింది.
రూ.50 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్
అందోల్-జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నారు. మున్సిపల్ అభివృద్ధికి నారాయణఖేడ్ పర్యటనలో భాగంగా రూ.25 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. సీఎం కేసీఆర్ మొదటి విడతలో మంజూరు చేసిన రూ.25 కోట్లతో 20 వార్డుల్లో 52 పనులు ప్రతిపాదించారు. రూ.9.35 కోట్లతో సీసీ రోడ్లు, రూ.7.30 కోట్లతో డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. రూ.1.90 కోట్లతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాళ్లు పూర్తి కావచ్చాయి. రూ.6.45 కోట్లతో పట్టణ సుందరీకరణ పనులు చేపట్టారు. రూ.2.55 కోట్లతో బతుకమ్మ ఘాట్, మినీ ట్యాంక్ బండ్, చిల్డ్రన్పార్కు ఇతరేతర పనులు చేపట్టడంతో చెరువుకు కొత్త అందం వచ్చింది. రూ.70 లక్షలతో జంక్షన్ సుందరీకరణ, సంగుపేట- క్యాంపు కార్యాలయం వరకు రోడ్ల వెడల్పు పనులు చేపడుతున్నారు. మున్సిపల్ భవనం, మాడ్రన్ దోబీ ఘాట్ నిర్మించాల్సి ఉంది. పట్టణ ప్రగతి నిధులతో ఆటోలు, ట్రాక్టర్లు, డ్రైనేజీ క్లీనర్ కొనుగోలు చేసి పారిశుధ్య పనులు చేపడుతున్నారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల పార్కు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, ప్రధాన రహదారి నిర్మాణం, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ ఇలా అనేక రకాల పనులు చేపడుతున్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
అందోల్-జోగిపేట మున్సిపల్ అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సిద్ధమని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు చెప్పడం సీఎం కేసీఆర్ రెండు విడతల్లో రూ.50 కోట్లు కేటాయిచారు. దీంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నిధులతో పార్టీలకతీతంగా అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. మున్సిపాలిటీని సీఎం కేసీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తాం. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ప్రత్యేక ధన్యవాదాలు.
– క్రాంతికిరణ్, ఎమ్మెల్యే, అందోల్
అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు
అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమ ప్రాధాన్యతనిస్తున్నాం. ఇప్పటికే స్థానిక అధికారులు, పాలక వర్గం సభ్యులు వార్డుల్లో పర్యటించి పనులు గుర్తించారు. అవసరాన్ని బట్టి వరస క్రమంలో పనులు చేపట్టనున్నాం. ముందుగా మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టి, వరస క్రమంలో పనులు పూర్తి చేస్తా. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు.
– గూడెం మల్లయ్య, చైర్మన్, అందోల్-జోగిపేట
వేగంగా అభివృద్ధి పనులు
అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ రెండు విడతల్లో రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. వాటితో మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నాం. పట్టణ సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నిధులతో మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ప్రాధాన్యతా క్రమంగా పలు పనులు గుర్తించి, వాటి అభివృద్ధిపై దృష్టి పెడతాం. అన్ని పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తాం.
– తిరుపతి, మున్సిపల్ కమిషనర్, అందోల్- జోగిపేట