కొల్చారం, మే 26: కారును ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన కొల్చారం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికు ల కథనం ప్రకారం.. పాపన్నపేట మండ లం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన టేక్మాల్ దుర్గాగౌడ్, భార్య లావణ్య, తల్లి లక్ష్మమ్మ, కొడుకు చోటు, తొమ్మిది నెలల కుమార్తె హర్షిత, తమ్ముడు టేక్మాల్ నాగరాజ్గౌడ్తో కలిసి శుక్రవారం హత్నూర మండలం దౌల్తాబాద్లో వివాహానికి హాజరయ్యారు. తిరిగి వస్తుండగా కొల్చారం మం డల కేంద్రంలోని జైన దేవాలయం సమీపంలో మెదక్ వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న టేక్మాల్ నాగరాజుగౌడ్ (30), దుర్గాగౌడ్ కూతురు హర్షిత(తొమ్మిది నెల లు) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి తల్లి లక్ష్మమ్మ, అన్న దుర్గాగౌడ్, వదిన లావణ్య, అన్న కొడుకు చోటుకు తీవ్ర గాయాలయ్యా యి. దుర్గాగౌడ్, లావణ్య పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానకుక తరలించారు. నాగరాజుగౌడ్, హర్షిత మృతదేహాలను మెదక్ ఏరియా దవాఖానకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు మెదక్ రూరల్ సీఐ విజయ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్లాపూర్లో విషాదఛాయలు
పాపన్నపేట, మే26: కొల్చారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగరాజుగౌడ్ అందరితో కలగొలుపుగా ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు.
కంటతడి పెట్టిన ఎమ్మెల్యే
బీఆర్ఎస్వీ పాపన్నపేట మండల విద్యార్థి నాయకుడు టేక్మాల్ దుర్గాగౌడ్ సోదరుడు టేక్మాల్ నాగరాజుగౌడ్ మృతదేహం మెదక్ దవాఖానకు చేరగానే మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మృతుడి భార్యను ఓదార్చి, కంటితడి పెట్టారు. అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబానికి రూ.20 వేలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట జిల్లా రైతు సమితి కో ఆర్డినేటర్ తాడెపు సోములు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ తదితరులు ఉన్నారు.
విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ
కొల్చారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటనపై ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు దుర్గాగౌడ్ తన కుటుంబంతో పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరగడం విచారకరమన్నారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.