తూప్రాన్, మే 17 : మెదక్ జిల్లా తూప్రాన్లో శనివారం పిడుగుపాటుకు గురై మృతిచెందిన ఇద్దరు బాలురు కుటుంబాలను బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పడాలపల్లిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ. 10 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో పిల్లలు అకాల మృతి చెందడం చాలా బాధాకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి…
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి 11వ వార్డు పడాలపల్లికి చెందిన నడిపల్లి యశ్వంత్ (14), పంబల్ల ప్రసాద్ (14), మొకద్దం కిరణ్ శనివారం సాయంత్రం క్రికెట్ ఆడుదామని పడాలపల్లికి సమీపంలోని ఊర చెరువు మైదానంలోకి వెళ్లారు. క్రికెట్ ఆడుతుండగా అకస్మాత్తుగా జోరుగా గాలివాన వీచింది. పిల్లలందరూ అక్కడున్న చెట్లవైపు పరుగులు తీశారు. కాసేపటికే భారీ శబ్దంతో ఉరుముతూ యశ్వంత్, ప్రసాద్, కిరణ్ తలదాచుకున్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన నడిపల్లి యశ్వంత్, పంబల్ల ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. మొకద్దం కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్సులో ముగ్గురిని తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మొకద్దం కిరణ్ను మెరుగైన వైద్యం కోసం ములుగులోని ఆర్వీఎం దవాఖానకు తరలించారు.