సంగారెడ్డి/ మెదక్ అర్బన్, జనవరి 10;సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ప్రజలు పల్లెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్లోని 8 డిపోల నుంచి తెలంగాణ పరిధిలో వివిధ ప్రాంతాలకు 148, ఆంధ్రప్రదేశ్లోని పలు పట్టణాలు, నగరాలకు మరో 20 సర్వీసులను ప్రారంభించారు. ఈ నెల 8 నుంచి 13వ తేదీల్లో స్పెషల్ బస్సులు నడిపించనుండగా, ప్రయాణికుల నుంచి టికెట్పై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయమని, సాధారణ రోజుల్లో ఉన్న ధరలు చెల్లిస్తే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. www.tsrtconlin.inవెబ్సైట్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోవాలని, వెళ్లడం, తిరుగు ప్రయాణాలకు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే పదిశాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. అధిక చార్జీలు వెచ్చించి ప్రైవేటు బస్సుల్లో వెళ్లడం కంటే సాధారణ చార్జీలు చెల్లించి టీఎస్ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణం చేసి గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ రీజియన్ నుంచి తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాలు, ఆంధ్రప్రదేశ్లోని పలు నగరాలు, పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా మెదక్ రీజియన్ నుంచి 148 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 148 బస్సులు, ఆంధ్రాలోని పలు ముఖ్యమైన ప్రదేశాలకు 20 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 8 ఆర్టీసీ డిపోల నుంచి దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు.
ఆంధ్రాకు 20 ప్రత్యేక బస్సులు
ఆంధ్రప్రదేశ్కు మెదక్ రీజియన్ నుంచి 20 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, కందుకూరు, ఉదయగిరి, నరసాపురం ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తాయి. ఈ బస్సు సర్వీసులు ఈ నెల 8న ప్రారంభమవగా, 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ పరిధిలో నడిచే 148 బస్సులు హైదరాబాదులోని వివిధ ప్రాంతాల నుంచి నడుస్తాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం జూబ్లీ బస్స్టేషన్, ఇమ్లీబన్ బస్ స్టేషన్, లింగంపల్లి నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. జహీరాబాద్, మెదక్, నారాయణఖేడ్, పిట్లం, బిచ్కుందకు వెళ్లే ప్రయాణికుల కోసం లింగంపల్లి నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి.
టికెట్ ధరలో 10 శాతం తగ్గింపు స్కీం ; నెలాఖరు వరకు సదావకాశం
మెదక్ అర్బన్, జనవరి 10: ప్రయాణికుల సేవే ప్రథమ కర్తవ్యంగా భావించే టీఎస్ ఆర్టీసీ ఆక్యుపెన్సీ పడిపోకుండా ఇప్పటికే అనేక రాయితీ పథకాలను అమలు చేసింది. దీంతో ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నది. రాబోయే సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని సొంతూళ్లకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు అడ్వాన్స్ టిక్కెట్ రానూపోను బుకింగ్ చేసుకుంటే టిక్కెట్ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అధికారికంగా ప్రకటించారు. జిల్లాలో చాలామంది సుదూర ప్రాంతాలైన కాకినాడ, అమలాపురం, తిరుపతి, హైదరాబాద్, బాన్సువాడ, బోధన్ లాంటి ప్రదేశాలకు ప్రయాణిస్తుంటారు. సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో టిక్కెట్ ధరలో 10 శాతం తగ్గింపు ధరను ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వనున్నారు.
మెదక్ జిల్లా నుంచి..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతిసారిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండక్కి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నది. పండుగ సందర్భంగా మెదక్, నర్సాపూర్లో డిపోలో మొత్తం 123 బస్సులు ఉన్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ బస్సులను నడపనున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్, తిరుపతి, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బొడ్మట్పల్లి, చేగుంట, రామాయంపేట, సిద్దిపేట, వరంగల్ లాంటి ప్రదేశాలకు రోజువారీ బస్సులతో పాటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.
అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ ప్రయాణం
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు పండుగలకు చార్జీలు పెంచకుండా ప్రస్తుతం ఉన్న చార్జీలతోనే సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టారు. అదనపు చార్జీలు లేకుండానే ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. www.tsrtconline.inలో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు.
రోజువారీగా నడవనున్న బస్సులు..
మెదక్ రీజియన్ పరిధిలోని 8 డిపోల నుంచి రోజువారీగా ఈ నెల 8 నుంచి 13 వరకు సంక్రాంతి బస్సులు తిరుగనున్నాయి. 8న 12 బస్సులు, 9న 21 బస్సులు, 10న 21 బస్సులు నడిచాయి. 11న 29 బస్సులు, 12న 32 బస్సులు, 13న 33 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. మరో 20 బస్సులను దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం నడుపనున్నారు. ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్ బుకింగ్కు వెబ్సైట్ www.tsrtconline.in ను 30 రోజుల నుంచి 60 రోజుల వరకు ప్రయాణికులకు అనుగుణంగా బుకింగ్ను ప్రవేశపెట్టారు. వెళ్లడం, తిరుగు ప్రయాణాలకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రయాణపు చార్జిపై 10 శాతం రాయితీ ఇస్తున్నారు.
పండుగలకు ప్రత్యేక బస్సులు
సంక్రాంతి వేడుకలకు మెదక్ రీజియన్ నుంచి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడం లక్ష్యం పెట్టుకున్నాం. ప్రయాణికుల రద్దీ పెరిగితే అదనపు బస్సులు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికి మెదక్ రీజియన్ నుంచి రాష్ట్రం పరిధిలో 148 బస్సులు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 20 బస్సులను నడిపించేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాం.
– సుదర్శన్, మెదక్ రీజినల్ మేనేజర్
రాయితీని సద్వినియోగం చేసుకోండి
ఆర్టీసీ ద్వారా సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సూపర్ లగ్జరీ, డిలక్స్ బస్సుల్లో రానుపోనూ టిక్కెట్ ధరలో 10 శాతం రాయితీ పథకాన్ని అమలు చేస్తున్నాం. మెదక్, నర్సాపూర్ డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల సౌకర్యర్థం ప్రత్యేక బస్సులు నడపనున్నాం. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–రవిచందర్, మెదక్ డిపో మేనేజర్