పిడికిలెత్తిన వరికంకులు
అన్నదాతల కోసం హస్తినలో ఆందోళన
ఢిల్లీ తెలంగాణ భవన్లో రైతు దీక్ష
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజాప్రతినిధుల నిరసన
మోదీ సర్కారు దిగి వచ్చి ధాన్యం సేకరించాలని డిమాండ్
సిటీ బ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : దేశ రాజధాని ఢిల్లీలో వరికంకులు పిడికిలెత్తాయి. తెలంగాణలో పండించిన పసిడిపంటపై కేంద్రానికి కడుపు మంట ఎందుకని ప్రశ్నించాయి. యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రం ధోకాను దేశమంతా వినిపించేలా రైతుల పక్షాన గొంతెత్తాయి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించిన రైతు దీక్షతో దేశ రాజధాని దద్దరిల్లింది. అన్నదాతలను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ… టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతనిధులు రైతుల పక్షాన ఢిల్లీలో కదం తొక్కారు. రైతే ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణపై వివక్ష చూపిస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. మోదీ సర్కారు మెడలు వంచైనా ధాన్యం సేకరణపై దిగివచ్చేలా చేస్తామని చెప్పారు.