(ఉమ్మడి మెదక్ జిల్లా నెట్వర్క్, నమస్తే తెలంగాణ): ‘భారత రాష్ట్ర సమితి దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది.. నవ శకానికి నాంది పలుకుతుంది.. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా సీఎం కేసీఆర్కు దేశంలో మంచిపేరుంది. సీఎం కేసీఆర్ ఏది చేసినా దాని వెనుక ఒక వ్యూహం ఉంటుంది’.. అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఆమోదం తెలపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్పై ఎవరు ఏమన్నారంటే…
దేశాభివృద్ధి కోసమే బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో దేశాన్ని కూడా అదే తరహాలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను తీసుకువచ్చారు. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా గుర్తింపు రావడం సంతోషకరం. సీఎం కేసీఆర్లాంటి సమర్థవంతుడైన వ్యక్తి దేశానికి ఎంతోఅవసరం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలుచేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాంటి పథకాలు దేశంలో అందరికీ అందాలంటే అది బీఆర్ఎస్తోనే సాధ్యం. ప్రజలు మెచ్చే నాయకుడు రాష్ర్టానికే కాదు దేశానికీ అవసరం. అందుకే దేశ ప్రజలంతా కేసీఆర్ను కోరుకుంటున్నారు.
– నర్సింహులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, పుల్కల్
దేశ ప్రజల కలలు, ఆకాంక్షలు ఆయన ద్వారానే నెరవేరుతాయి..
సీఎం కేసీఆర్ది ఉక్కు సంకల్పం. ఏ ఉద్యమమైనా ఒంటరిగా ప్రారంభించి, ప్రభంజనం సృష్టంచడం ఆయన ప్రత్యేకత. పోరాట పటిమతో రాష్ర్టాన్ని సాధించారు. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా నిలిపారు. ఇప్పుడు తెలంగాణ సంక్షేమ పథకాలను దేశవాప్తంగా అందించాలని సంకల్పించారు. అందుకు భారత రాష్ట్ర సమితి పార్టీకి అంకురార్పణ చేశారు. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్కు పూర్తి పట్టుంది. దేశ ప్రజల కలలు, ఆకాంక్షలను నెరవేర్చే మేధాశక్తి, గొప్ప నాయకత్వం ఆయన సొంతం. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేయడం ఖాయం.
– క్రాంతికుమార్, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, సిద్దిపేట
దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం
రెండు దశాబ్దాలకు పైగా టీఆర్ఎస్ పార్టీని అధినేత సీఎం కేసీఆర్ పటిష్ట పరిచారు. తెలంగాణ వచ్చాక సీఎం పగ్గాలు చేపట్టి తనదైన శైలిలో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ప్రధానంగా రైతు సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అందరినీ బాగా ఆకర్షించాయి. అందుకే, దేశ రాజకీయాల్లో ఆయన సేవలు అవసరమని ఇతర రాష్ర్టాల్లో ప్రజలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడంతో దేశం రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలైంది. అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పని చేస్తే తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది.
– తేజారావు దేవకత్తే,విశ్రాంత వీఆర్వో, సిర్గాపూర్
దేశవ్యాప్తంగా రైతులకు న్యాయం
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ వల్ల దేశ వ్యాప్తంగా రైతులకు పూర్తి న్యాయం జరుగుతుంది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ అందరికీ అందుతాయి. పారిశ్రామిక రంగం, ప్రభుత్వ ఖాళీల భర్తీతో ఎంతో మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు లభిస్తాయి. కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ ద్వారా అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందుతారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కొట్లాడే శక్తి కేవలం సీఎం కేసీఆర్కే ఉంది.
– దేమె యాదగిరి, రామాయంపేట, మెదక్ జిల్లా
రాష్ర్టాల హక్కులు హరించడం దుర్మార్గం
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరించడం హేయమైన చర్య. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల అప్పిగిస్తూ అన్నదాతలను రోడ్డున పడేస్తున్నది. విద్యుత్ రంగాన్ని కూడా బడాబాబుల కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన చేస్తున్నారు. కోటి ఎకరాల మాగానికి సాగునీళ్లదించేందుకు ప్రాజెక్టులు కట్టడం తప్పా. రాష్ట్రంపై కేంద్రం నిత్యం విషం చిమ్ముతూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారనున్నారు. తెలంగాణ ప్రజలు ఆయన వెన్నంటే ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. బీఆర్ఎస్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తూ లేఖ రాయడం సంతోషకరం.
– డాక్టర్ వైద్యనాథ్, టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి
తిరుగులేని రాజకీయశక్తిగా బీఆర్ఎస్
రాబోయే రోజుల్లో దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా భారత రాష్ట్ర సమితి ఎదుగుతుంది. సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనున్నది. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశంలోని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరుగాలని దేశ ప్రజలు కాంక్షిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లింది. సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
– ఊట్ల బాలనర్సింహారెడ్డి, అధ్యాపకుడు, మద్దూరు
ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి
ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ దేశ ప్రజల కోసం పని చేస్తుంది. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా సీఎం కేసీఆర్కు దేశంలో మంచిపేరుంది. సీఎం కేసీఆర్ ఏది చేసినా దాని వెనుక ఒక వ్యూహం ఉంటుంది. బీఆర్ఎస్ను ఈసీ గుర్తించడం సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ దేశంలో, తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
– రేణికుంట సత్యం, సిద్దిపేట రూరల్