ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో బీడు భూములు సస్యశ్యామలం
నాలుగు మండలాల్లో 13వేల ఎకరాలకు సాగునీరు
ఉమ్మడి రాష్ట్రంలో సింగూరు నీళ్లను హైదరాబాద్కే పరిమితం చేశారు
స్వరాష్ట్రంలో జిల్లా సాగు, తాగునీటి అవసరాలకు వాడుతున్నాం
అందోల్ నియోజకవర్గం వట్పల్లిలో రేణుకాఎల్లమ్మ ఎత్తిపోతల ప్రారంభం
జోగిపేటలో, అల్లాదుర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు
భవిష్యత్తులో సంగారెడ్డి జిల్లా మరో కోనసీమలా మరనున్నదని, ప్రాజెక్టులు, ఎత్తిపోతలతో బీడు భూములు సస్యశ్యామలంగా మారనున్నాయని వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం అందోల్ నియోజకవర్గం వట్పల్లి మండలం సాయిపేట వద్ద రూ.36.17కోట్లతో నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతలను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీతో కలిసి మంత్రి ప్రారంభించారు. జోగిపేట, అల్లాదుర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాలెల్మ శివారులో ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సింగూరు జలాలను సాగుకు వినియోగించుకోవాలన్న అందోల్ ప్రజల దశాబ్దాల కల నేడు నెరవేరిందన్నారు. ఈ ప్రాజెక్టుతో 14గ్రామాల్లోని 13 వేల ఎకరాలకు నీరందుతుందని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా వర్షాధార పంటలపై ఆధారపడిన రైతుల కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమానికి సర్కార్ టీఆర్ఎస్ పెద్దపీట వేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్రావు అండతోనే ఎత్తిపోతల పూర్తయిందని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు.
అందోల్, జూన్ 20 : సింగూరు జలాలు సేద్యానికి వినియోగించుకోవాలన్న అందోల్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతలతో సాకారమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రం పాలనలో సింగూరు ప్రాజెక్టు అంటే హైదరాబాద్కు తాగునీరు అందించేందుకు మాత్రమే ఉంది అనేవిధంగా గత పాలకులు పెత్తనం చెలాయించి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు చుక్క తాగు, సాగు నీరు ఇవ్వలేదని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా ప్రజల అవసరాలు గుర్తించిన సీఎం కేసీఆర్ సింగూరు నీటిని పూర్తిగా జిల్లా అవసరాలకే ఉపయోగించుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. సోమవారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం వట్పల్లి మండలం సాయిపేట గ్రామంలో రూ.36.17కోట్లతో నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల ప్రాజెక్టును ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం అందోల్ మండలంలోని తాలెల్మా గ్రామ శివారులోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల నిర్మాణంతో అందోల్ నియోజకవర్గంలోని 14గ్రామాల్లో సుమారు 13వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు.
సింగూరు నీటిని నిండు కలశాలతో తెచ్చి ఎల్లమ్మ తల్లి పాదాలు కడిగి ఎత్తిపోతలు ప్రారంభించుకున్నామని, ఆ తల్లి దయతో రైతుల దశాబ్దాల కల నెరవేరి ఈ ప్రాంతం పాడిపంటలతో విలసిల్లనున్నదన్నారు. అందోల్ నియోజకవర్గ రైతుల కష్టాలు తీర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం 2017-18లోనే తాలెల్మ శివారులో రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించిందన్నారు.ఎన్నో ఏండ్లుగా వర్షాధార పంటలపై ఆధారపడి సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న రైతుల కల నిజం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఎలాంటి అభివృద్ధి చేశారు… ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో అందోల్ ప్రజలు గుర్తించాలన్నారు. రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల ద్వారా అందోల్ మండలంలోని 9, వట్పల్లి మండలంలోని 3, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల్లోని ఒక్కో గ్రామాలకు సాగునీరు అందుతుందని, ప్రత్యక్షంగా 3వేల ఎకరాలు, పరోక్షంగా మరో పది వేల ఎకరాలకు సాగు నీరు అందుతాయన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మరో కోనసీమను తలపిస్తుందన్నారు. ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూ ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు పంట పెట్టుబడికి రైతు బంధు, ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతుబీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు.
వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో రైతులు భూములు విక్రయించుకోవద్దన్నారు. ధరలు బాగా వస్తున్నాయని చాలా మంది రైతులు భూములు విక్రయిస్తున్నారని, ఈ రోజు దారెంట వస్తుంటే చాలా చోట్ల చుట్టూ కడీలు పాతిన భూములే కనిపించాయని, ఎవరు కూడా భూములు అమ్మి నష్టపోవద్దన్నారు. తలాపునే సింగూరు ఉన్నా ఈ ప్రాంతం సాగునీటికి నోచుకోలేదని నేడు ఈ ఎత్తిపోతల పథకం పూర్తవడం, త్వరలో బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులు పూర్తికానుడడంతో భవిష్యత్లో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. మల్లన్న సాగర్ ద్వారా సింగూరును నింపనుండడంతో ఇకపై ఏ కాలంలోనైనా ప్రాజెక్టు నిండుకుండలా ఉంటుందని, మల్లన్న సాగర్ గ్రావిటీ ద్వారా 70వేల ఎకరాలు పారనున్నట్లు తెలిపారు. బసవేశ్వర, సంగమేశ్వర కింద అన్ని గ్రామాలకు సాగునీరు అందేలా చర్యలు చేపడుతున్నామని 1.80లక్షల ఎకరాలకు 3 లిఫ్ట్లతో సాగునీరు అందిస్తామన్నారు. గతంలో మంజీరా ప్రాజెక్టుపై చెక్డ్యాంలు కట్టేందుకు గత పాలకులు ఎన్నో అడ్డంకులు సృష్టించారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.1.22కోట్లతో 15చెక్డ్యాంలు నిర్మిస్తే అందులో 13చెక్డ్యాంలు అందోల్, జోగిపేటల్లోనే ఉన్నాయని మంత్రి తెలిపారు. ఎత్తిపోతలను ప్రారంభించి నీటిని దిగువకు వదలడంతో తాలెల్మ శివారులోని చెక్డ్యాం నిండింది. దీంతో నీటిని చూసిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. యువకులు నీటిలో దిగి కేరింతలు కొడుతూ సందడి చేశారు.
సభకు హాజరైన రైతులు, టీఆర్ఎస్ నాయకులు
ఎత్తిపోతలతో బీడు భూములు సస్యశ్యామలం
వట్పల్లి, జూన్ 20 : రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకం ద్వారా బీడు భూములు సైతం సస్యశ్యామలంగా మారుతాయని మంత్రి హరీశ్రావు అన్నారు. వట్పల్లి మండలం సాయిపేటలో సోమవారం రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీశ్ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఎల్లమ్మ ఎత్తిపోతలతో ఖాదిరాబాద్, కేరూర్, సాయిపేట గ్రామాల రైతులకు అవసమైన సాగు నీరు అందుతుందని, బీడు భూములు సైతం పంట పొలాలుగా మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఆర్డీవోలు అంబాదాస్, నాగేశ్వర్, తహసీల్దార్లు ప్రభులు, అశోక్ కుమార్, ఎంపీపీ కృష్ణవేణి, జడ్పీటీసీ అపర్ణ, ఎంపీడీవో జగదీశ్వర్, సర్పంచ్ సంగీత, ఎంపీటీసీ సంగన్న, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అందుబాటులో ఉండడంతోనే అభివద్ధి సాధ్యం
అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అందోల్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి హరీశ్రావు ఎమ్మెల్యేను అభినందించారు. తాలెల్మా ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తి చేసేందుకు ఎమ్మె ల్యే ఎంతో కృషి చేశారని క్రాంతి పట్టుదలతోనే ఎత్తి పోతల ప్రారంభమై రైతుల కల నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, ఇన్చార్జి ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, రాష్ట్ర నాయకులు రాహుల్ కిరణ్, హృదయ్కిరణ్, భిక్షపతి, ఎత్తిపోతల చైర్మన్ లింగాగౌడ్, ఎంపీపీ బాలయ్య,జడ్పీటీసీ రమేశ్, మార్క్ఫెడ్ డైరక్టర్ జగన్మోహన్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
సీఎం, మంత్రి అండతోనే అభివృద్ధి : ఎమ్మెల్యే క్రాంతికిరణ్
సీఎం కేసీఆర్ ఆశీస్సులు,మంత్రి హరీశ్రావు అండతోనే అభివృద్ధి సాధ్యమైతున్నదని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. మంత్రి కృషి ఫలితంగానే నేడు రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభమై రైతుల సాగు నీటి కల సాకరమైందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి : ఎంపీ బీబీ పాటిల్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ రూపురేఖలు మారిపోయన్నారు. దేశం గర్వించేలా కళేశ్వరం నిర్మించి రైతుల సాగుకు ఇబ్బందులు లేకుండా నీటిని అందించి రైతాంగానికి ఎంతో అండగ నిలుస్తున్నారన్నారు.
బీడు భూములు సస్య శ్యామలం : జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ
జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి మాట్లాడుతూ తన్నీరు పేరులోనే నీరు ఉందని, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నీటి కొదవా ఉండదన్నారు. బీడు భూములు సస్య శ్యామలం అందోల్ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎత్తిపోతల పథకం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బీడు భూములు సస్య శ్యామలం కానున్నాయన్నారు.