కరోనాతో రెండేండ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్నామని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్లో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. ప్రతిపక్షాలు బరువు బాధ్యతలు విస్మరించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఆంగ్లమీడియం ప్రారంభిస్తామ న్నారు. త్వరలోనే కొత్త పింఛన్లు, ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. కేంద్ర సర్కారు అసమర్ధ విధానాలతో దేశంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. సీఎం కేసీఆర్ ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
తూప్రాన్/మనోహరాబాద్, మే 15: టీఆర్ఎస్ పార్టీది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో రూ. 8 కోట్లతో, మనోహరాబాద్ మండలంలో రూ. 5 కోట్లతో నిర్మించనున్న సమీకృత భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు దండుపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు బరువు బాధ్యతలు లేవని, ఎన్నో మాట్లాడతారన్నారు. కానీ, మోసేవాడికే బరువు తెలుస్తుందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఆదరిస్తారన్నారు. త్వరలోనే కొత్త పింఛన్లు అందించడంతో పాటు సొంత జాగ ఉన్నవారికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తూ మెరుగైన వైద్యంతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ కేసీఆర్ కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. మనోహరాబాద్ మీదుగా గజ్వేల్, సిద్దిపేట, వేములవాడ, రాజన్న సిరిసిల్లకు రైలుమార్గం అందుబాటులోకి వస్తుందన్నారు. రెండేండ్లుగా కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గినా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులు చేస్తున్నదని, టీఆర్ఎస్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు.
ప్రతి పాఠశాలను మోడల్గా తీర్చిదిద్దుతాం …
రాష్ట్రంలోని ప్రతి పాఠశాలను మోడల్గా తీర్చిదిద్దేందుకే ‘మనఊరు – మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ‘మనఊరు-మనబడి’ కింద తూప్రాన్ ఉన్నత పాఠశాలలో రూ. 90 లక్షలతో అదనపు గదులు, వంటశాల, శౌచాలయాలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకోవడానికి దాతలు ముందుకు వస్తే, వారు నిర్మించిన గదులకు లేదా సూళ్లకు వారి పేరు పెడతామన్నారు. పెద్ద కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు ముందుకు వచ్చి పాఠశాలలను దత్తత తీసుకోవాలని కోరారు. చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. వారంతా ముందుకు రావాలన్నారు. మనం చదువుకున్న పాఠశాలను మనం బాగుచేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో పిల్లలందరికీ సన్నబియ్యంతో కడుపు నింపుతున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యనందిస్తామన్నారు. ఒకేసారి ఇంగ్ల్లిష్ మీడియంలోకి పిల్లలు మారాలంటే కొంచెం కష్టంతో కూడిన పని అని, అందుకే పాఠ్య పుస్తకాల్లో పేరాలను పైన ఇంగ్లిష్, కింద తెలుగు రెండు భాషల్లో ముద్రిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు కూడా తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లో బోధిస్తారని, దీని ద్వారా విద్యార్థులు ఇంగ్లిష్ను సులభంగా అర్థం చేసుకుంటారన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలకు అభివృద్ధి పట్టదు…
ప్రతిపక్షాలకు రాష్ర్టాభివృద్ధి పట్టదని, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం అలవాటుగా మారిందన్నారు. రాష్ర్టానికి కేంద్ర బీజేపీ సర్కారు అన్నివిధాలుగా అన్యాయం చేస్తున్నదని, బీజేపీ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభలో ఆద్యంతం బీజేపీ నేతలంతా అబద్ధాలే మాట్లాడారని, వారికి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. పెట్రో,డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బీజేపీ సర్కారు పేదలపై భారం మోపిందన్నారు. కేంద్ర సర్కారు అసమర్ధ విధానాలతో దేశంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీచైర్ పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్, ఫారెస్ట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చ్రందాగౌడ్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, తూప్రాన్ ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేశ్, మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, జీడ్పీటీసీ రాణీసత్యనారాయణ గౌడ్, టీఆర్ఎస్ తూప్రాన్ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి బాబుల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీశ్చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏర్పుల లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి పంజాల ఆంజనేయులు, మనోహరాబాద్ మండల అధ్యక్షుడు పురం మహేశ్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, రైతు బంధు కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ లతావెంకట్ గౌడ్, మనోహరాబాద్ సర్పంచ్ మహిపాల్ రెడ్డితో పాటు తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.