హుస్నాబాద్, జనవరి 30: జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో పట్టణాలు, గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను కొనసాగించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో మహాత్మాగాంధీ వర్థంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్మికులను సన్మానించి కొత్తబట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం బాధ్యతగా గుర్తించాలన్నారు. హుస్నాబాద్ పట్టణాన్ని కాలుష్య రహిత, ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుద్దామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడు పల్లెలు, పట్టణాలు సస్యశ్యామలంగా, పరిశుభ్రంగా విలసిల్లుతాయన్నారు.
వాడవాడలా చెత్త సేకరణ చేసి పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివన్నారు. హుస్నాబాద్ పట్టణానికి ఇప్పటి వరకు మూడు జాతీయ స్థాయి అవార్డులు రావడం హర్షనీయమని, ఇందులో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. అనంతరం సన్మానం పొందిన పారిశుధ్య కార్మికులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాశేఖర్, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు బోజు రమారవీందర్, జనగామ రత్నమాల, పెరుక భాగ్యరెడ్డి, వల్లపు రాజు, చిత్తారి పద్మ, భూక్య సరోజన, కోమటి స్వర్ణలత, నాయకులు ఆకుల వెంకట్, కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, ఎండీ హసన్, పున్న సది, అయిలేని శంకర్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.