మెదక్/ సంగారెడ్డి న్యూస్నెట్వర్క్, జూన్ 17 ;తండాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొని గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రోడ్ల సౌకర్యం, గురుకులాలు, రిజర్వేషన్ పెంపు, పంచాయతీలుగా గుర్తింపు, ఇంటింటికీ తాగునీటి సరఫరా తదితర కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పంచాయతీలు, కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. అడవిబిడ్డల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ను దర్శించుకుని భోగ్ బండార్ పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం వడ్డెనగూడ తండాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్ హాజరయ్యారు.
గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన తండాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కంది మండలం వడ్డెనగూడ తండాలో నిర్వహించిన గిరిజన దినోత్సవానికి గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ హాజరయ్యారు. తండా శివారులోని క్రీడా ప్రాంగణం నుంచి గిరిజనులు డప్పుచప్పుళ్లు, నృత్యాలతో అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. క్రీడా ప్రాంగణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వాలీబాల్ ఆడి ఉత్సాహాన్ని నింపారు. ర్యాలీగా బయలుదేరి సమావేశ సమీపంలోని భవానీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్టేజీపైకి చేరుకుని గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు. గురుకులాల్లో చదువుకుని పది, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సన్మానించారు. అంతకుముందు రూ.20 లక్షల నిధులతో నిర్మించనున్న పంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తండాల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. కావాల్సిన నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించిందని గుర్తు చేశారు. జీవితంలో ఎదుగుదలకు మొదటి అడుగు చదువేనన్నారు. చదువుతో కుటుంబంతోపాటు సొసైటీలో గౌరవం ఏర్పడుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం చదువుకు అధిక ప్రాధాన్యతనిచ్చి గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నదన్నారు. గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1800 గిరిజన తండాలకు రూ.2100 కోట్లతో బీటీ రోడ్లు, రూ.1000 కోట్లతో విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలు ఏర్పాటు చేసి పరిపాలనా సౌలభ్యం కల్పించడంతోపాటు గతేడాదిలో 2 వేల పంచాయతీలకు భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఎస్పీ రమణకుమార్, ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డీపీవో సురేశ్ మోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, బీఆర్ఎస్ కంది మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో విశ్వప్రసాద్, ఎంపీవో మహేందర్, సర్పం చ్ మనిబాయ్, నాయకులు పాల్గొన్నారు.
పండుగలా దశాబ్ది వేడుకలు ; సంగారెడ్డి కలెక్టర్ శరత్
పండుగ వాతావరణంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్నామని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. మౌలిక వసతులతో తండాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గతంలో తండాలకు వస్తే నీళ్లు లేవని ఖాళీ బిందెలతో అడ్డగించిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం అన్ని నిండు బిందలేనన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో తండాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయన్నారు. గతంలో రూ.200 ఉన్న పింఛన్ను రూ.2016కు పెంచారని, దివ్యాంగులకు రూ.3 వేలు ఉన్న పింఛన్ రూ.4016కు ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశారు. గిరిజన విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా సంగారెడ్డి జిల్లాలో 5 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి 4 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం కింద 4 వేల మంది గిరిజన ఆడబిడ్డలకు రూ.4 కోట్లు, సబ్సిడీ రుణాల కింద రూ.4.40 కోట్లు అందించినట్లు తెలిపారు. 81 తండాల్లో రూ.630 కోట్లతో 53 బీటీ రోడ్లు వేశామన్నారు.
గిరిజనుల జీవితాల్లో వెలుగులు: హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్
గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. 2014కు ముందు, తర్వాత తండాల పరిస్థితి ఎలా ఉందో గమనించాలన్నారు. తండాలకు రోడ్లు లేక రవాణా సౌకర్యం ఉండేది కాదని, తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అద్దంలా రోడ్లు, మిషన్ భగీరథ నీరు, విద్యుత్ సౌకర్యం, మౌలిక వసతులు సమకూరాయన్నారు. గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారని తెలిపారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో లా కళాశాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రతిఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.