మెదక్ అర్బన్, నవంబర్ 22 : కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని, జనాభాకు అనుగుణంగా ప్రస్తుత ఎన్నికల్లో గిరిజనులకు టిక్కెట్లు కేటాయించలేదని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని వేంకటేశ్వరగార్డెన్లో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజనులు పట్టించుకోలేదని ఆరోపించారు. మన ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను జరపలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో గిరిజనులు ఏడు శాతం ఉండగా, కాంగ్రెస్ పార్టీ ఐదుగురికి మాత్రమే టిక్కెట్ ఇచ్చిందన్నారు. జనాభాలో మూడు శాతం ఉన్న కులస్తులకు రేవంత్రెడ్డి ఏడు సీట్లు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గిరిజనులు మోసం చేసందుకు ప్రయత్నిస్తున్నాయని, వారిని దగ్గరకు రానివ్వద్దని చెప్పారు. మాతండా మారాజ్యం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, అందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ తండాలను ప్రత్యేక పంచాయతీలు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సేవాలాల్ జయంతి ఉత్సవాలను గిరిజనులకు వివిధ పథకాల ప్రవేశపెట్టినట్లు వివరించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, పోడు భూముల హక్కు కల్పించారని వివరించారు. తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మన గిరిజన జాతి మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం వస్తే ఉసిళ్లు ఏ విధంగా వస్తాయే ఎన్నికలు వస్తే విజయశాంతి అదేవిధంగా వస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. మాజీ ఎంపీ విజయశాంతికి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఈ పదవులు వచ్చాయని వారు మర్చిపోవద్దని అన్నారు. కొడుకుకు టిక్కెట్ ఇవ్వకపోవడం వల్ల మైనంపల్లి హనుమంతరావు స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ను వీడి విమర్శిస్తున్నారని ఆరోపించారు. 11 సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమిలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కష్టాలు తెలుసునని, కష్టాలు ఉన్నచోట కేసీఆర్ సంక్షేమ పథకం ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి బాటలో నడవాలంటే తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రావాలని, అందుకు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరక్టర్ దేవేందర్రెడ్డి, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాసునాయక్, జాతీ య కార్యవర్గ సభ్యులు కిషన్ నాయక్, రాష్ట్ర సంఘ బాధ్యులు వసంత్ నాయక్, రమేశ్ నాయక్, బాలాజీ నాయక్, శ్రావణ్ నాయక్, సాయి నాయక్, మెదక్ జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్ మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.