చిన్నశంకరంపేట,జులై05 : పాముకాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేటలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాలిపేట గ్రామానికి చెందిన నర్ర సత్తమ్మ(51) సోమవారం వ్యవసాయ పొలంలో పనులు నిర్వహిస్తుండగా పాము కాటు వేసింది.
విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నార్సింగ్లోని ఓ ప్రైవేటు దవఖానాకు తరలించారు. దవఖానాలో చికిత్స పొందుతూ సత్తమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలు కుమారుడు మహేశ్ ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట ఎస్సై సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.