హుస్నాబాద్టౌన్, ఫిబ్రవరి 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హుస్నాబాద్కు మహర్దశ పట్టింది. గడిచిన మూడేండ్లలో పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన కాలనీలు సైతం నేడు అభివృద్ధి చెందాయి. తెలంగాణ ప్రభు త్వం పట్టణానికి ఇస్తున్న నిధుల కారణంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులకు హుస్నాబాద్ కేరాఫ్ మారింది. హుస్నాబాద్ మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన మూడేండ్లలో పట్టణానికి దాదాపు రూ.30కోట్లకుపైనే నిధులు మంజూరయ్యాయి.
దుకాణాల సముదాయం
పట్టణంలోని మున్సిపల్కు చెందిన స్థలంలో నూతనంగా దుకాణాల సముదాయాన్ని నిర్మిస్తున్నారు. స్థానిక మల్లెచెట్టు వద్ద రూ.1.23కోట్లతో దుకాణాల సముదాయం, తహసీల్ కార్యాలయం ఆవరణలో రూ. 2.75కోట్లతో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మిస్తున్నారు. స్థ్థానిక స్టేడియం వద్ద కోటి రూపాయలతో అన్నిరకాల సౌకర్యాలతో వైకుంఠధామాన్ని నిర్మిస్తున్నారు.
ప్రకృతి వనాలు… నర్సరీ
టీయూఎఫ్ఐడీసీకి చెందిన రూ.35లక్షలతో నర్సరీకి ప్రహరీ, షెడ్నెట్, డ్రిప్ తదితర నిర్మాణాలు చేపట్టారు. పట్టణ ప్రగతికి చెందిన రూ.పదిలక్షలతో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కల పెంపకాన్ని మున్సిపల్ పాలకవర్గం చేపట్టింది. పట్టణంలోని పలు చోట్ల ప్రకృతి వనాలను సైతం ఏర్పాటు చేశారు.
పట్టణానికి నిధుల వరద..
హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి వివిధ గ్రాంట్ల రూపంలో నిధుల వరద పారింది. ప్లాన్గ్రాంట్, టీయూఎఫ్ఐడీసీ, ఎస్ఎఫ్సీ, సబ్ల్ప్లాన్, 14వ ఆర్థిక సంఘం నిధులకుతోడు నూతనంగా పట్టణ ప్రగతి నిధులు సైతం రావడంతో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఇరువై వార్డుల్లో గడిచిన మూడేండ్లలో ఇరువై కిలోమీటర్ల మేర సీసీరోడ్లు, 11 కిలోమీటర్ల మేర మురుగు కాల్వలను నూతనంగా నిర్మించారు.
ఆరోగ్యం పంచే జిమ్లు, ఆహ్లాదాన్ని అందించే పార్కులు పట్టణ ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రత్యేకంగా పార్కులు, జిమ్లు సైతం ఏర్పాటు చేశారు. పట్టణ ప్రగతి నిధుల ద్వారా స్థానిక ఎల్లమ్మచెరువు వద్ద రూ. 30లక్షలతో, స్థానిక డిపో వెనుక కాలనీలో రూ. 35లక్షలతో పార్కు, జిమ్లను సైతం ఏర్పాటు చేశారు. స్థానిక మినీ స్టేడియం వద్ద కోటి రూపాయలతో ఇండోర్ స్టేడియం పనులు సైతం దాదాపు పూర్తి కావచ్చాయి.
ప్రత్యేకంగా షెడ్లు..పబ్లిక్ టాయిలెట్లు
హుస్నాబాదద్ పట్టణ శివారులోని మహ్మదాపూర్ రోడ్డులో తడి, పొడి చెత్తడంపుల కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో రూ. 29.52లక్షలతో తడి, పొడిచెత్త కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. స్థానిక సర్కారు దవాఖానతో పాటు అనభేరి విగ్రహం వద్ద పట్టణ ప్రగతికి రూ.9.96లక్షలు, పోలీస్స్టేషన్ సమీపంలో శ్రీరేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద ఎస్ఎఫ్సీకి చెందిన రూ. 24లక్షలతో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు.
రెండుకోట్లతో నూతన మున్సిపల్ భవన నిర్మాణం
పట్టణానికి నూతనంగా మంజూరు చేసిన మున్సిపల్ భవనం పనులు చకచకా కొనసాగుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో టీయూఎఫ్ఐడీసీకి చెందిన రెండు కోట్లు మంజూరు కాగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక మండల పరిషత్ ఆవరణలో నిర్మిస్తున్న ఈ భవనం అన్ని హంగులతో సిద్ధమవుతోంది.
అభివృద్ధి నిరంతర ప్రక్రియ
అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. హుస్నాబాద్ పట్టణాన్ని అన్నింటా అభివృద్ధి చేసేందుకు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సహకారంతో కృషిచేస్తున్నాం. పాలకవర్గంతో పాటు ప్రజల సహకారంతోనే పట్టణానికి స్వచ్ఛ సర్వేక్షణ్లో రెండుసార్లు అవార్డులను సైతం దక్కించుకున్నాం. పట్టణంలోని వెనుకబడిన ప్రాంతాలతో పాటు అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రణాళికా ప్రకారం పనులు చేయడంతోనే హుస్నాబాద్ అభివృద్ధి చెందుతున్నది.
-ఆకుల రజితావెంకన్న, చైర్పర్సన్, హుస్నాబాద్ మున్సిపల్