ప్రజల దరికే ప్రభుత్వ పాలన తీసుకురావడంతోపాటు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజన చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేండ్లకు కొత్త జిల్లాలను ప్రకటించగా, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటగా ఏర్పాటయ్యాయి. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలు చెప్పుకొనేందుకు 70-80 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అవస్థలు పడిన ప్రజలకు నేడు బీఆర్ఎస్ సర్కారు పాలనను దరి చేర్చింది. జిల్లాకేంద్రాల్లో కొత్తగా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, ప్రభుత్వ దవాఖానలు నిర్మిస్తున్నది. ప్రజలకు ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. – మెదక్/ సంగారెడ్డి (నమస్తే తెలంగాణ), జూన్ 9
మెదక్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): పరిపాలనా వ్యవస్థ ప్రజలకు చేరువగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. పరిపాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రెండేండ్లలోనే పరిపాలనా సంస్కరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ సంస్థలను ప్రజలకు చేరువ చేయడానికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇందులోభాగంగా మెదక్ కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. కొత్త రెవెన్యూ డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి ప్రజలను ప్రభుత్వ సంస్థలను దగ్గర చేసింది. పరిపాలనా సౌలభ్యం సులభతరమైన పర్యవేక్షణ మాత్రమే కాక ప్రజలకు ఎంతో దూరభారం తగ్గింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి కేంద్రంగా ఉండేది. మెదక్ జిల్లాకు సంబంధించిన పనులన్నీ సంగారెడ్డి కలెక్టరేట్లోనే జరుగుతుండేవి. మెదక్ నుంచి సంగారెడ్డికి వెళ్లాలంటే 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎవరికైనా పనులు కాకపోతే మరుసటి రోజు మళ్లీ సంగారెడ్డి బాట పట్టాల్సిందే. చాలా ఇబ్బందులు పడిన మెదక్ పరిసర ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత మెదక్ జిల్లా కేంద్రాన్ని ప్రకటించారు. దీంతో ప్రజలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అన్ని పనులు ఇక్కడే జరుగుతున్నాయి. దీంతో సంగారెడ్డికి వెళ్లే వ్యయప్రయాసలు తగ్గాయి. గతంలో కలెక్టరేట్ భవనాలు అరకొర వసతులతో ఉండేవి. టాయిలెట్స్ కూడా సరిగా ఉండేవి కావు. కార్యాలయానికి వచ్చే ప్రజలు కూర్చొనేందుకు కుర్చీలు అందుబాటులో ఉండేవి కావు. కానీ, ప్రస్తుతం మెదక్ జిల్లాలో సకలసౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మిస్తున్నది. నూతన కలెక్టరేట్ కార్యాలయంలో అన్నీ శాఖలూ ఒకే దగ్గర ఉండేలా చూస్తున్నారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీ కార్యాలయాల భవన నిర్మాణాలు కూడా త్వరగా పూర్తవనున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 46 మండలాలు ఉండేవి. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు అయిన తర్వాత 2 డివిజన్లు ఏర్పాటు కాగా, అందులో నర్సాపూర్, తూప్రాన్ కొత్త డివిజన్లుగా ఏర్పడ్డాయి. 15 మండలాలతో మెదక్ జిల్లా ఏర్పాటైంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నూతనంగా మండలాలను ఏర్పాటు చేశారు. ఇందులో మరో 6 మండలాలు ఏర్పాటయ్యాయి. దీంతో మెదక్ జిల్లా 21 మండలాలకు చేరుకుంది. కొత్తగా హవేళీఘనపూర్, మనోహరాబాద్, నిజాంపేట్, చిలిపిచెడ్, నార్సింగి, మాసాయిపేట మండలాలు ఏర్పడ్డాయి. జిల్లాలో గతంలో 312 గ్రామ పంచాయతీలు ఉండగా, నూతనంగా 157 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఇందులో 62 గిరిజన గ్రామ పంచాయతీలు ఏర్పాటు కావడం విషయం. గతంలో మెదక్ మున్సిపాలిటీ మాత్రమే ఉండగా, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటు అయిన తర్వాత నూతనంగా 5 పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇందులో హవేళీఘనపూర్, మనోహరాబాద్, నిజాంపేట్, నార్సింగి, చిలిపిచెడ్లలో నూతన పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేశారు. వాటితోపాటు రామాయంపేట, టేక్మాల్లలో నూతన పోలీస్స్టేషన్ భవనాలు, సీఐ కార్యాలయ భవనాలను నిర్మించారు.