సంగారెడ్డి, జూన్ 16: కేసుల ఛేదనకు పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకుని విచారించాలని ఎస్పీ రమణకుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
సమాజంలో పలు రకాల కేసుల్లో నేరం చేసిన వారికి శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. పెండింగ్లో (అండర్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచి దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కేడీ, సస్పెక్ట్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, నేరగాళ్ల నుంచి సత్ప్రవర్తన కోరుతూ బైండోవర్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్లుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.
బైక్ రైడర్స్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, దీంతో కలిగే ఉపయోగాలను ప్రజలకు వివరించాలన్నారు. అక్రమ మద్యం, డీజిల్, పెట్రోల్ రవాణాను అరికట్టాలన్నారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన లేమితో డబ్బులు ఫ్రీగా వస్తాయని, చెప్పగానే ఆశ పడి ఓటీపీ, పాస్వర్డ్ చెప్పడం, ఆన్లైన్లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో వివిధ నాటకాల రూపంలో ప్రజల ముందుకెళ్లి వారిని చైతన్యపర్చాలన్నారు. అనవసర లింకులు ఓపెన్ చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ డీఎస్పీలు రవీంద్రారెడ్డి, భీమ్రెడ్డి, రఘు, వెంకట్రామ్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మహేశ్గౌడ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.