నర్సాపూర్, ఏప్రిల్ 16: నాయకులు బీఆర్ఎస్ను వీడినా పార్టీకి ఢోకాలేదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొందరు నాయకులు బీఆర్ఎస్ను వీడినా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. అవినీతి ఆరోపణలతో బయటకురాని వ్యక్తులే బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లారని ఎద్దేవా చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్లో చేరారన్నారు.
కాంగ్రెస్లోకి కేవలం కొందరు నాయకులు మాత్రమే వెళ్లారని, కార్యకర్తలు వెళ్లలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ వెంటే ఉంటారని, బీఆర్ఎస్ కోసం పని చేసి ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజయానికి కృషి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, సత్యంగౌడ్, సూరారం నర్సింహులు పాల్గొన్నారు.