కొమురవెల్లి, డిసెంబర్ 13: పశువుల ఎరువుకు భలే డిమాండ్ ఏర్పడింది. యాసంగి సీజన్ కోసం ముందస్తుగా పశువుల పేడను పంట పొలాల్లో వేసే పనుల్లో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. పశుసంపద తగ్గడంతో సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి అధిక ధరకు కొనుగోలు చేస్తూ తమ పంట పొలాలకు తరలిస్తున్నారు.
పొలాల్లో భూసారం పెరిగేందుకు సేంద్రియ ఎరువులు ఉపయోగపడుతాయి. వరి, మొక్కజొన్న, సజ్జలు, నువ్వులు, వేరుశనగ, కూరగాయ పంటలను రైతులు ఎక్కువగా పండిస్తారు. భూసారం పెరిగేందుకు పశువుల పేడ, చెరువు మట్టి చల్లుతారు. ధర పెరిగినప్పటికీ దిగుబడి అధికంగా వస్తుండటంతో రైతులు సేంద్రియ ఎరువులు కొనుగోలు చేస్తున్నారు.
ఎరువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఆయా గ్రామాల్లో పశువుల ఎరువు లభ్యం కాకుంటే సరిహద్దు గ్రామాలకు వెళ్లి పశువుల ఎరువును రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడ్కు రూ. 4వేల నుంచి 5 వేల వరకు చెల్లించి కొంటున్నారు. దానికి తోడు ట్రాక్టర్ కిరాయి సైతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
సేంద్రియ ఎరువుకు డిమాండ్ పెరగడానికి పశు సంపద కొరతే ప్రధాన కారణం. వ్యవసాయంలోకి ఆధునిక యంత్ర పరికరాల ప్రవేశంతో ఎద్దులు కనుమరుగయ్యాయి. పశుగ్రాసం దొరకక గేదెలు, ఆవులు సైతం పల్లెల్లో కనిపించేడం లేదు. దీంతో రైతులకు పేడ నిల్వచేసే పరిస్థితి లేకుండా పోయింది.
సేంద్రియ ఎరువుల కొరత ఉంది. పశువులు లేక పోవడంతో ధరలు బాగా పెరిగాయి. సేంద్రియ ఎరువులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కొనుగొలు చేసి పంట పొలాల్లో చల్లుతున్నాం. దీంతో పంటలకు ఎంతో ఉపయోగపడటంతో పాటు అధిక దిగుబడులు వస్తాయి.
సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు వస్తాయి. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూమి సారవంతం కావడంతో పాటు ఫర్టిలైజర్స్ కంటే సేంద్రియ ఎరువులతో చేసే వ్యవసాయానికి పెట్టుబడి తక్కువ కావడంతో పాటు దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలకు డిమాండ్ ఉండటంతో రైతులకు లాభాలు ఎక్కువగా వస్తాయి.