సంగారెడ్డి, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో అభివృద్ధి బాటలో పయనించిన పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1615 పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ సర్కారు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పదేండ్ల పాటు పల్లెలు ప్రగతిలో దూసుకుపోయాయి. ఎన్నో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. ఈ నేపథ్యంలో గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగియడంతో శుక్రవారం నుంచి అధికారులు పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం సర్పంచ్ల పదవీకాలం ముగిసేలోపు ఎన్నికలు నిర్వహించాలి. అయితే, ఎన్నికలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా, తమ పదవీకాలం పొడిగించాలని సర్పంచ్లు చేసి విన్నపాన్ని సైతం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో శుక్రవారం నుంచి ‘ప్రత్యేక’ పాలన అమలులోకి రానున్నది. ఇందుకోసం ఉమ్మడి మెదక్ జిల్లాలోని పంచాయతీలకు అధికారులను నియమించింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1615 పంచాయతీలు ఉన్నాయి. 2019 జనవరి 21, 25, 30 తేదీల్లో మూడు విడతలుగా కేసీఆర్ సర్కార్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలుపొందగా, ఫిబ్రవరి 1వ తేదీన సర్పంచ్లు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వారి పదవీకాలం ముగిసింది. దీంతో సంగారెడ్డి జిల్లాలో 647, సిద్దిపేట జిల్లాలో 499, మెదక్ జిల్లాలోని 469 పంచాయతీలకు ప్రత్యేక అధికారులును ప్రభుత్వం నియమించింది. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, రెవెన్యూ ఇన్స్పెక్టర్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు, వ్యవసాయశాఖ అధికారులు, పశువైద్య, వైద్యారోగ్యశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ‘ప్రత్యేక’ బాధ్యతలు చేపట్టనున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కో అధికారికి ప్రభుత్వం రెండు నుంచి మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించింది. కాగా, శుక్రవారం మూడు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పాలనపై దిశానిర్దేశం చేయనున్నారు. 3వ తేదీన మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేయనున్నారు.
కేసీఆర్ పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయాయి. ఇంటింటికీ తాగునీరు, రోడ్లు, అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, పంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాల వంటి ఎన్నో కార్యక్రమాలు బీఆర్ఎస్ సర్కార్ చేపట్టింది. సంపూర్ణ పారిశుధ్యం కోసం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లు అందజేయటంతో పాటు డంప్యార్డులు నిర్మించింది. అయితే, కేసీఆర్ హయాంలో పల్లెలు ప్రగతికి ఆదర్శంగా నిలిచాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించినా ఆ స్థాయిలో అభివృద్ధి జరగకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలాచోట్ల ఇప్పటికే కరెంటు కోతలు, తాగు, సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రానున్న వేసవిలో తాగునీరు, కరెంటు కష్టాలు మరింత పెరగొచ్చని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.