అందోల్, మార్చి 27: తెల్లారితే పెండ్లి భాజాలతో మార్మోగాల్సిన ఇంట్లో తీవ్ర విషా దం నెలకొన్నది. బంధువులతో కలిసి ట్రాక్టర్లో పెండ్లి కూతురును తీసుకొచ్చేందుకు ఆనందంగా బయలుదేరినవారు మరికొద్దిసేపట్లో పెండ్లి కూతురు ఇంటికి చేరుకుంటామనే లోగా ట్రాక్టర్ బోల్తాపడడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండి, 27మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదానికి సంబంధించి జోగిపేట ఎస్సైఅరుణ్కుమార్గౌడ్ తెలిపిన కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన యువకుడికి అందోల్కు చెందిన యువతితో గురువారం పెండ్లి నిశ్చయించగా బంధువులు పెండ్లి కూతురును తీసుకొచ్చేందుకు బుధవారం ట్రాక్టర్లో బాచారం నుంచి అందోల్కు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ మండలంలోని మన్సాన్పల్లి శివారులోకి రాగానే మూల మలుపు వద్ద బోల్తాపడిండి. దీంతో అందులో ప్రయాణిస్తున్న బాచారానికి చెందిన సంగమ్మ (45) బుధేమ్మ( 52), ఆగమ్మ (42) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 26 మందికి తీవ్రగాయాలు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
స్వల్పంగా గాయపడిన వారిని జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా… తీవ్రగాయాలైన వారిని సంగారెడ్డి, హైదరాబాద్ దవాఖానలకు తరలించారు. ట్రాక్టర్ను డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మూలమలుపు ఉండడం, మితిమీరిన వేగం కారణంగా ట్రాక్టర్ బోల్తాపడింది. ప్రమాద స్థలంతో పాటు జోగిపేట ప్రభుత్వ దవాఖాన వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. తీవ్రం గా గాయపడన వారిలో మూడేండ్ల చిన్నారి కూడా ఉడడంతో వారి తల్లిదండ్రుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ప్రమా ద స్థలాన్ని సీఐ చెంద్రయ్య పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.