సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం నిర్వహించిన ‘టెట్’ సజావుగా జరిగింది. మొదటి పేపర్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవగా గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో ఆలస్యంగా వచ్చిన పలువురిని పోలీసులు గేటు వద్దే ఆపేయడంతో వారంతా నిరుత్సాహంతో వెనుదిరిగారు. సంగారెడ్డి జిల్లాలో పేపర్ 1కు 13,537మంది అభ్యర్థులకు 11, 535 మంది, పేపర్2కు 9,729 మందికి 8,938 మంది హాజరయ్యారు.
మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన 21 ఎగ్జామ్ సెంటర్లలో పేపర్1కు 5,031 మందికి 4,386 మంది, పేపర్ 2కి 3,368 మందికి 3,145 మంది పరీక్ష రాసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల కేంద్రాలను ఆయన సందర్శించి పరీక్ష నిర్వహణను పరిశీలించారు. మౌలిక వసతులపై ఆరాతీశారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో టెట్ రాసేందుకు వచ్చిన ఎనిమిది నెలల గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను ఏరియా దవాఖానకు తరలించగా, మార్గమధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
– సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 15
సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 15: తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ శుక్రవారం సంగారెడ్డి, మెదక్ జిల్లాలో సజావుగా ముగిసింది. సంగారెడ్డి జిల్లాలో పరీక్షలకు 88 శాతం, మెదక్ జిల్లాలో అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ను జిల్లాలో సజావుగా నిర్వహించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మెదక్ జిలాల్లో 21 పరీక్షా కేంద్రాలకు గాను మెదక్లో 18, రామాయంపేటలో 3 ఏర్పాటు చేశారు. పేపర్-1కు 5,031 మందికి 4,386 (87 శాతం) హాజరయ్యారు. పేపర్-2 కు 3,368 మంది అభ్యర్థులకు 3,145 మంది (93.4శాతం) హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.
నిమిషం నిబంధనతో..
నిమిషం నిబంధనతో ఇద్దరు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. సిద్దిపేటకు చెందిన నవ్య, చిన్నశంకరంపేటకు చెందిన నవీన్ 9.30 గంటల తరువాత మెదక్లోని గీతా జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి జిల్లాలో 57 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1కు మొత్తం 13,537 మంది అభ్యర్థులకు 11,535 మంది 83.21 శాతం హాజరయ్యారు. 42 కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2కు 9,729 మందికి 8,938 మంది అభ్యర్థులు 91.87 శాతం హాజరయ్యారు. మొత్తం 23,266 మందికి 20,473 మంది 88 శాతం హాజరయ్యారు. జిల్లా పరిశీలకుడిగా రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణ సంచాలకుడు శ్రీనివాస చారి, డీఈవో వెంకటేశ్వర్లు కేంద్రాలు పరిశీలించారు.
టెట్ రాయడానికి వచ్చి గర్భిణి మృతి
రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి ఇందిరానగర్కు చెందిన రాధిక (32), సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ రాయడానికి పరీక్షా కేంద్రానికి త్వరగా చేరుకోవాలని వేగంగా వచ్చిన 8 నెలల గర్భిణి అభ్యర్థిని హఠాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందింది.