మెదక్ మున్సిపాలిటీ, జనవరి 22: క్రీడాకారులు ఆరోగ్యంగా ఉంటారు, ఈ వయస్సులో క్రీడల్లో పాల్గొని అందరికీ స్ఫూర్తిగా నిలిచారని ఇఫ్కో డైరెక్టర్, మాస్టర్ అథ్లెటిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ దేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ తెలంగాణ స్టేట్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవేందర్రెడ్డి హాజరై మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రభుకుమార్గౌడ్తో కలిసి విజేతలకు పతకాలు, ప్రశాంసాపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 35 నుంచి 102 ఏండ్ల వయస్సు గల వారు ఈ పోటీల్లో పాల్గొనడం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు. వయస్సు పైబడిన ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నారంటే అది మీ శారీర ధృడత్వమే అన్నారు. మీ సంకల్పాన్ని చూస్తుంటే యువతతో పోటీ పడేలా ఉన్నారని కొనియాడారు.
ఈ క్రీడల కోసం మాజీ సైనికులు, డాక్టర్లు, ఇంజినీర్లు, రిటైర్డు ఉద్యోగులు తదితర రంగాల వారు సొంత ఖర్చులతో రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అందరి సహకారం ఉంటే ఈ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. క్రీడాకారులకు వసతి సౌకర్యాల కోసం క్రీడల మంత్రి శ్రీనివాస్గౌడ్, ఆర్థిక మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లి 400 మందికి వసతి కల్పించే స్పోర్ట్స్ హాస్టల్ కోసం కృషి చేస్తామన్నారు. శాయ్ ఆధ్వర్యంలో స్టేడియం ఉన్నా ఇక్కడి బాక్సింగ్, అథ్లెటిక్స్ అకాడమీలను గచ్చిబౌలికి తరలించారని, అవి తిరిగి మెదక్ తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించి వారు ఫిబ్రవరిలో హర్యానాలోని కురుక్షేత్రలో జరిగే నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు వెళ్లనున్నారని, ఆ పోటీలు వీక్షించేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. స్టేడియంలోని సింథటిక్ ట్రాక్ గచ్చిబౌలి ట్రాక్లా ఉందని క్రీడాకారులు చెప్పడం ఎంతో సంతోషానిచ్చిందన్నారు.
ఈ పోటీలను అవకాశం కల్పించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులను పీఈటీలను, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు. అంతకుముందు రాష్ట్ర కార్యదర్శి ప్రభుకుమార్గౌడ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్రావు, పీటీటీల జిల్లా కార్యదర్శి శ్రీనివాస్రావు, పీడీ ప్రభు, పీఈటీలు రాజేందర్, ప్రతాప్సింగ్, మహిపాల్, స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు జుబేర్ అహ్మద్, కొండ శ్రీనివాస్, సంగ శ్రీకాంత్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు జయరాజ్, వనజ, సమియొద్దీన్, ఉమర్, మాజీ కౌన్సిలర్ గౌష్ఖురేషి, బీఆర్ఎస్ నాయకులు శంకర్, అరవింద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆకర్షణీయంగా నిలిచిన విజయ్కుమార్
ఈ పోటీలకు హాజరైన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ విజయ్కుమార్ మెడలో కిలోకు పైగా బంగారు గోలుసులతో హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. క్రీడాకారులు విజయకుమార్తో ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. విజయ్ కుమార్కు బంగారు ఆభరణాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు.
మీ సహకారం మరువలేనిది..
మాస్టర్స్ అథ్లెటిక్స్ విజయవంతగా నిర్వహించిన వారందరికీ అసోసియేషన్ రాష్ట్ర లైఫ్టైమ్ అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలు నిర్వహించడానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో పాటు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి సంపూర్ణ సహకారం మరువలేనిదని, 700 మందికి పైగా క్రీడాకారులకు మంచి భోజన సౌకర్యంతో పాటు వసతి కల్పించి ఇబ్బందులు కలుగకుండా తోడ్పాటునందించారని కొనియాడారు. గచ్చిబౌలి, వరంగల్ తర్వాత ఇంత చక్కటి సింథటిక్ ట్రాక్ మెదక్లో ఉండటం గొప్ప విషయమన్నారు. ఎన్నో పనులు ఉన్నా మూడు రోజుల పాటు సమయాన్ని కేటాయించి క్రీడాకారులకు అన్నిరకాల సౌకర్యాలు, వసతులు కల్పించిన దేవేందర్రెడ్డికి రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
– మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర లైఫ్టైమ్ అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి
92 ఏండ్ల వయస్సులో 3 బంగారు పతకాలు
మేడ్చల్ జిల్లాకు చెందిన ఎంఎల్ఎన్రెడ్డి రిటైర్డు పోలీస్ అధికారి. ఎక్కడ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు జరిగినా వెళ్తుంటారు. మెదక్లో జరిగిన పోటీల్లో డిస్కస్ త్రో, హమేర్ త్రో, షాట్ఫుట్ మూడు క్రీడల్లో పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.
ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిన మేడ్చల్ జిల్లా..
రెండు రోజులుగా నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడల్లో అత్యధిక విజయాలతో 787 పాయింట్లు సాధించి మేడ్చల్ జిల్లా ఓవరాల్ చాంపియన్షిప్ సాధించింది. 318 పాయింట్లు సాధించి సంగారెడ్డి జిల్లా రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా, 175 పాయింట్లు సాధించి హైదరాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. 174 పాయింట్లతో రంగారెడ్డి నాలుగు, 167 పాయింట్లతో నిజామాబాద్ ఐదు, 136 పాయింట్లతో మంచిర్యాల ఆరు, 126 పాయింట్లతో హన్మకొండ జిల్లా ఏడో నిలిచింది. 93 పాయింట్లు సాధించిన మహబూబాద్ ఎనిమిదో స్థానం, 67 పాయింట్లతో వికాబాద్ జిల్లా తొమ్మిది, 60 పాయింట్లతో మెదక్, నాగర్కర్నూల్ జిల్లాలు పదో స్థానంలో నిలిచాయి. 47 పాయింట్లు సాధించి సిద్దిపేట జిల్లా 11, 39 పాయింట్లతో పెద్దపల్లి జిల్లా 12, 31 పాయింట్లతో సిరిసిల్ల 13, 25 పాయింట్లతో కరీనంగర్ 14, 17 పాయింట్లు సాధించిన వరంగల్ జిల్లా 15వ స్థానాన్ని కైవసం చేసుకున్నది. 15 పాయింట్లు సాధించి కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు 16వ స్థానం, 8 పాయింట్లు సాధించి నల్గొండ జిల్లా 17వ స్థానం, 5 పాయింట్లు సాధించి కొత్తగూడెం జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఫిబ్రవరి 15, 16 తేదీల్లో హర్యానాలోని కురుక్షేత్రలో జరిగే నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన వారు పాల్గొనున్నారు.